ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 22: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన ఘనత ఓయూది అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ‘ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా’ ఆధ్వర్యంలో అందజేయనున్న ‘డీన్ అవార్డ్ – 2022 ఫర్ రీసెర్చ్ స్కాలర్ ఎక్స్లెన్స్ ఇన్ లా’ ప్రధాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. లా విభాగం చరిత్రలో మొదటిసారిగా న్యాయ పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డును నెలకొల్పారు. పీజీఆర్ఆర్సీడీఈలోని సెంటెనరీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ను గౌరవ డాక్టరేట్తో మొదటిసారి దేశంలోనే గౌరవించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీకే దక్కుతుందని అన్నారు.
అంబేద్కర్కు డాక్టరేట్ అందించిన రోజును పురస్కరించుకుని జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. శనివారం లా విభాగంలో ప్రతిభావంతుడైన పరిశోధక విద్యార్థికి డీన్ రీసెర్చ్ అవార్డు అందజేయడం శుభసూచకమన్నారు. కీలకోపన్యాసం చేసిన ఢిల్లీ, నేషనల్ లా వర్సిటీ వీసీ ప్రొ.శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ ఈ అవార్డు పొందిన పరిశోధక విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలని, అప్పుడే అవార్డు లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ప్రొ. గాలి వినోద్కుమార్ మాట్లాడుతూ అవార్డు కోసం దరఖాస్తు చేసిన వారిని మూడు దశల్లో స్క్రుటినీ చేశామని, నిష్పక్షపాతంగా మెరిట్ ఆధారంగానే అవార్డును అందజేస్తున్నామన్నారు. డీన్ రీసెర్చ్ అవార్డును ఈ ఏడాదికి గాను నిషిత్ తాండ్రకు అందజేశారు. అనంతరం, జేఆర్ఎఫ్, పీడీఎఫ్, ఆర్జీఎన్ఎఫ్ పొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి, మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి విద్యాధర్, ఓయూ యూజీసీ డీన్ ప్రొ. జి.మల్లేశం, ప్రొఫెసర్లు విద్యా కుమారి, విష్ణుప్రియ, రామారావు, డా.వెంకటేశ్వర్లు, డా.రాంప్రసాద్ పాల్గొన్నారు.