సిద్దిపేట అర్బన్, నవంబర్ 3:‘రాష్ట్రంలో నేను ఒక బాధ్యతాయుతమైన అధికారిని. నా సర్వీసులో ఎన్నడూ న్యాయస్థానాలను అగౌరవపర్చలేదు. అనేక సార్లు కోర్టు తీర్పులను గౌరవించా. కానీ, కోర్టులకు వ్యతిరేకంగా నేను ప్రకటనలు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చా యి. కావాలనే నా ప్రకటనలు తప్పుగా వక్రీకరించారు’ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్య, ప్రత్యామ్నాయ పం టల సాగుపై గత నెల 25న జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుదోవ పట్టించారని ఆయన తెలిపారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన కలెక్టర్ అందులో పూర్తి వివరణ ఇచ్చారు.
సమావేశంలో జరిగిందిదీ..
రైతులను తీవ్రంగా వేధిస్తున్న నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టేందుకు కొన్ని నకిలీ విత్తనాలు అమ్మే దుకాణాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే రైతుల భూములు ధ్వంసమై తీరని నష్టం వాటిల్లుతుందని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకొని, లైసెన్స్ రద్దు చేస్తామని 25 నాటి సమావేశంలో చెప్పానని వెల్లడించారు. వేసవికాలంలో సిద్దిపేట జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలో వరిని పండించారని, అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పారాబాయిల్డ్ రైస్ పంపించటం ఆపాలని, రా రైస్ పంపించాలని సూచించిన అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై డీలర్లు రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరామని, వచ్చే సీజన్లో ఎదురయ్యే సమస్యలు, సాదకబాధకాలపై కూడా ఆ సమావేశంలో చర్చించామని వివరించారు. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని, కానీ, డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని మాత్రమే మాట్లాడానని కలెక్టర్ వివరణ ఇచ్చారు. న్యాయస్థానాలను కించపరిచే పదాలను తాను వాడలేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజాప్రయోజనాల కోసమే పని చేశానని, ఈ విషయమై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. తాను చేసిన ప్రకటనలను కోర్టు ముందు స్పష్టం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, తనను చెడుగా చూపించేందుకు కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.
‘నకిలీ’ డీలర్లనే హెచ్చరించా..
సమావేశంలో కొందరు నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు ఉన్నారని గుర్తించి వాళ్లను హెచ్చరించానని కలెక్టర్ తెలిపారు. ‘నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు. నిజాన్ని తొక్కిపెట్టి కోర్టుల్లో కేసులు వేసి, ఉత్తర్వులు తెచ్చుకుంటే.. వాస్తవ పరిస్థితిని కోర్టుకు వివరించి మీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం’అని వారిని హెచ్చరించానని వివరించారు.