సిటీబ్యూరో / అమీర్పేట్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యది హైదరాబాద్ మహానగరంతో నాలుగు దశాబ్దాల విడదీయరాని బంధం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఉంటూనే ప్రజాసేవలో తరించారు. మాజీ ముఖ్యమంత్రి టీ. అంజయ్య మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచే రోశయ్య నగరంలోనే నివాసం ఏర్పరచుకున్నారు. నగరంలోని అమీర్పేట ధరంకరం రోడ్డులోని కాలనీలో సుమారు 1200గజాల స్థలంలో 1982లో సొంత ఇంటిని నిర్మించుకున్న నాటి నుంచి తాను ఏ హోదాలో కొనసాగినా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా కొనసాగినా అధికార నివాసాలు కాకుండా తన సొంతింటి నుంచే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో డీకేరోడ్డులోని రోశయ్య నివాస పరిసర ప్రాంతాల వారు పోలీసు ఆంక్షలతో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడాలని తన భద్రతా వ్యవహారాలు చూసే సిబ్బందికి సుతిమెత్తని సూచనలు చేసే వారని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు చెబుతున్నారు.
హోంమంత్రిగా అద్దె ఇంట్లో…
1982లో అమీర్పేట ధరం కరం రోడ్డు లో సొంతింటి నిర్మాణం జరుగక ముందు ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పని చేసిన రోశయ్య ఆ సమయంలో అమీర్పేట్లోని ఓ భవంతిలో అద్దెకు ఉండేవారు. 1980లో టి.అంజయ్య మంత్రివర్గంలో రవాణా, గృహనిర్మాణశాఖ మంత్రిగా, 1982లో కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగా అమీర్పేట్లో ప్రస్తుత గురుగోబింద్సింగ్ స్టేడియం సమీపంలోని భవంతిలో ఆయన నివాసముండేవారని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. 1982లో డీకే రోడ్డు లో ఇంటిని నిర్మించుకున్న నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు ఇదే ఇంట్లో ఉన్నారు.
బల్కంపేట అమ్మవారి సేవలో…
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి చేయూతనందించడంలో కొణిజేటి రోశయ్య కుటుంబం ముందుంటుంది. రోశయ్య ఏ హోదాలో కొనసాగినా ఆయన సతీమణి కొణిజేటి శివలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులంతా నిరాడంబరంగా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే వారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇక దేవాలయంలో దాతల చేయూత అవసరమైన పరిస్థితుల్లో ముందుగా స్పందించేది రోశయ్య కుటుంబ సభ్యులేనని చెబుతారు. బోనాల కాంప్లెక్స్ నిర్మాణం, దేవాలయం లోపల గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు రోశయ్య చేయూతతోనే జరిగాయి. రోశయ్య కుటుంబ సభ్యులంతా అమ్మవారి సేవలో ఉంటుండగా…ఆయన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యేవారు. 2011లో అమ్మవారి కళ్యాణానికి ఆయన హాజరయ్యారు. 2012లో తమిళనాడు గవర్నర్ హోదాలో మహా కుంభాభిషేకానికి పవిత్రమైన సప్త నదీజలాలను అమ్మవారికి సమర్పించుకున్నారు.
మెట్రోరైలు ఒప్పందంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. 2010 సెప్టెంబర్ 4న ఎల్ అంట్ టీ మెట్రోకు జరిగిన ఒప్పందంలో ప్రస్తుతం మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డితో పాటు అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరించారని మెట్రో రైలు ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.