ఒకప్పుడు అది కరువు ప్రాంతం. ఏ ఉపాధీ ఉండేది కాదు. అలాంటి పరిస్థితులలో మహిళలంతా కలిసి తమ గెలుపు కథను తామే రాసుకున్నారు. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయినీ జాగ్రత్తగాపొదుపు చేసుకోవడమే ఆర్థిక సాధికారతకు మార్గమని భావించారు.ఆ లక్ష్య సాధనలో భాగంగా.. భారతమాత మండల మహిళా సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరివారమే ఇప్పుడు దేశవ్యాప్తంగా 337 సంఘాలతో పోటీపడి ఉత్తమ మహిళా సమాఖ్య పురస్కారానికి ఎంపికైంది.
భీమదేవరపల్లి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత హనుమకొండ జిల్లాలో ఉంది. అప్పట్లో ఇక్కడ కరువు రాజ్యమేలేది. దీంతో ప్రతి ఇల్లూ ఓ అప్పుల కుప్పగా మారింది. స్థానికంగా ఉపాధి అవకాశాలూ నామ మాత్రమే. దీంతో పిల్లల్ని చదివించలేని పరిస్థితి. ఆడపిల్లలకు పెండ్లి చేయలేని పేదరికం. ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి మహిళలు నడుం బిగించారు. భీమదేవరపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో స్వయం సహాయ సంఘం(ఎస్హెచ్జీ)గా ఏర్పడ్డారు. గ్రామంలోని గ్రూపులన్నీ కలిసి గ్రామ సమాఖ్యగా… గ్రామ సమాఖ్యలన్నీ కలిసి ‘భారతమాత మండల మహిళా సమాఖ్య’గా రూపుదాల్చాయి. ఒక్కో స్వయం సహాయక సంఘంలో 10 నుంచి 19 మంది సభ్యులు ఉంటారు. ఐదొందల మందితో మొదలైన భారతమాత మండల సమాఖ్య బలగం ఇప్పుడు ఆరువేలు దాటింది. 1139 ఎస్హెచ్జీలు, 49 గ్రామ సంఘాలుగా విస్తరించింది. సంఘం ఏర్పడిన తొలిదశలోనే.. ప్రతి సభ్యురాలు రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకు రూ. 30 పొదుపు చేయడం తప్పనిసరి చేశారు. అందులో ప్రతిపైసా సమర్థంగా వినియోగించుకున్నారు. అవసరం ఉన్న మహిళలకు రుణంగా ఇచ్చారు. అప్పు తీసుకున్నవారు ఆ మొత్తాన్ని వ్యవసాయానికి, పిల్లల చదువులకు వినియోగించారు. క్రమంగా స్వయం ఉపాధివైపూఅడుగులు వేశారు. పాడి పరిశ్రమ, పిండి గిర్ని, కూరగాయల సాగు, టైలరింగ్, నూనె మిల్లు నిర్వహణ.. ఇలా ఆసక్తి ఉన్న వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నారు. అందులో విజయం సాధించారు. నాలుగురాళ్లు వెనకేసుకున్నారు. కుటుంబానికి అండగా నిలిచారు.
పొదుపు సంఘాలు ఏర్పడిన కొత్తలో ఒక్కో గ్రూపునకు రూ.15 వేల బ్యాంకు రుణానికి మాత్రమే అర్హత ఉండేది. ఇప్పుడు ఆ మొత్తం సగటున రూ.23 లక్షలకు చేరింది. ఒక్కో సభ్యురాలికి సగటున కనీసం రూ.2 లక్షల బ్యాంకులోను అర్హత వచ్చింది. ప్రతి సంఘంలో మొదట్లో రూ.25 వేల కార్పస్ ఉండేది. ఇప్పుడది రూ.5 లక్షలకు చేరింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రతి సంఘానికి రూ.22 వేల వరకు లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాల సదుపాయాన్ని కల్పించింది.
దాన్నీ వినియోగించుకుంటున్నారు. రుణాల తిరిగి చెల్లింపు కూడా నూటికి నూరు శాతమే. సంఘాల ఆర్థిక నిర్వహణ పక్కాగా ఉంది.అన్ని వివరాలు డిజిటలైజ్ చేయడంతో ఈ సమాఖ్యకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. సంఘాలు అందించిన పెట్టుబడితో లాభదాయకమైన పంటలు పండిస్తూ రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతంఅవుతున్నాయి. సమాఖ్య ఆధ్వర్యంలో.. 28 రైతు ఉత్పత్తి సంఘాలు, ఐదు పాడి ఉత్పత్తి సంఘాలు ఏర్పడ్డాయి. రెండు వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో 70 శాతం ప్రజలు పేదరికంలో ఉండేవారు. తాజా నివేదిక ప్రకారం ఇది 40 శాతం లోపే ఉన్నది.మహిళల చొరవతో సాధించిన అద్భుత విజయం ఇది. కాబట్టే నాబార్డ్, ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అందించే జాతీయ పురస్కారం దక్కింది. ఈ ఘనత కోసం 337 సంఘాలు తీవ్రంగా పోటీపడ్డాయి.
గతంలో పైసల కోసం అనేక కష్టాలు పడ్డాం. మా మండలంలో కూలీ కూడ సక్కగా దొరక్క పోయేది. అందుకే మేం పొదుపు చేసుకునే ఆలోచన చేసినం. అందరి కష్టంతో మా సమాఖ్య ఆర్థికంగా బల పడింది. ప్రతి మహిళకూ ఈ లాభాలు దక్కుతున్నాయి. సభ్యుల కృషి, ప్రభుత్వ చొరవ, అధికారుల తోడ్పాటుతోమా సమాఖ్య జాతీయ అవార్డుకు ఎంపికైంది.
పోలు రజిత, సమాఖ్య అధ్యక్షురాలు
క్రమం తప్పకుండా రుణాలు తిరిగి చెల్లిస్తున్నాం. అధికారుల సూచనతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మా సభ్యుల ఆరోగ్యం కోసం అనేక చర్యలు చేపట్టాం. వరుసగా రెండోసారి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. సభ్యుల కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది.
అంబాల శోభ, ప్రధాన కార్యదర్శి