రసవత్తరంగా సాగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 117 స్థానాల్లో 92 సీట్లను గెలుచుకొన్నది. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమైంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 273 చోట్ల బీజేపీ కూటమి విజయం సాధించింది. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి ఈ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకొన్నా.. అధికారానికి చేరువ కాలేకపోయింది. ఎస్పీ సొంతంగా 111 స్థానాలను కైవసం చేసుకొన్నది. 1996 తర్వాత యూపీలో ప్రతిపక్ష పార్టీకి వందకు పైగా సీట్లు రావడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్లో 47, మణిపూర్లో 32 సీట్లను గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని బీజేపీ సాధించింది. గోవాలోని 40 సీట్లలో 20 స్థానాల్లో గెలిచిన కమలదళం.. మెజారిటీ మార్కుకు ఒక్క సీటు దూరంలో నిలిచిపోయింది.
1. ఆప్ నేత భగవంత్ మాన్.. భగత్సింగ్ పూర్వీకుల గ్రామం ఖాట్కర్కలాన్లో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. భగవంత్ మాన్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించారు. ‘జుగ్ను మస్త్ మస్త్’ టీవీ షోతో పాపులారిటీ సంపాదించారు.
2. సీఎం చన్నీ బదౌర్లో ఆప్ అభ్యర్థి, మొబైల్ మెకానిక్ లాబ్సింగ్ చేతిలో ఓడిపోయారు. అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ నేత సిద్దూ.. ఆప్ నేత, ఆరోగ్య కార్యకర్త జీవన్జ్యోత్ కౌర్ చేతిలో ఓటమి చెందారు.
3. రైతు ఉద్యమం దేశాన్నంతటినీ కదలించింది. కానీ, పంజాబ్ ఎన్నికల్లో రైతుల తరఫున బరిలో నిలిచిన సంయుక్త సమాజ్ మోర్చా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
4. సోనూసూద్ సోదరి మాళవికాసూద్ ఓడిపోయారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆమె.. మోగాలో ఆప్ అభ్యర్థి అమన్దీప్ కౌర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు అమరిందర్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కూడా ఓటమి పాలయ్యారు. చన్నీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ మట్టికరవడం గమనార్హం. ఉత్తరాఖండ్లో ధామీ ఓడిపోయినప్పటికి బీజేపీ అధికారాన్ని నిలుపుకొన్నది. శిరోమణి అకాలీదళ్చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గోవా మాజీ సీఎం, తృణమూల్ అభ్యర్థి చర్చిల్ అలేమావ్ కూడా ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.