KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. గ్రామగ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు తమ అధినేతకు మద్దతుగా కదం తొక్కడంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. కార్యకర్తలు ఎక్కడికక్కడ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామగ్రామాన గర్జించిన కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నిన్న ఉదయం నుంచే గ్రామగ్రామాన గర్జించిన మా కార్యకర్తలకు, సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచిన వారియర్లకు, ప్రతి పట్టణంలో కదంతొక్కి మోటర్ సైకిల్ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా గొప్పగా పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.