ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతూ రాష్ట్ర ప్రజల్నికంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా, థానే జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడ లాక్డౌన్ విధించారు. థానే నగరం మొత్తం మీద 16 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మార్చి 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.
హాట్స్పాట్లుగా గుర్తించిన 16 ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో యధావిధిగా కార్యక్రమాలు జరుగుతాయి. గత కొన్నిరోజులుగా థానే జిల్లాలో కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో లాక్డౌన్ విధించినట్లు థానే మున్సిపల్ కమిషనర్ విపిన్ శర్మ తెలిపారు. హాట్స్పాట్లుగా గుర్తించిన 16 ప్రాంతాల్లో అన్ని వాణిజ్య కార్యకలాపాలు.. మందుల దుకాణాలు, డెయిరీలు, కిరాణా సామాగ్రి, ఇతర నోటిఫైడ్ యూనిట్లు వంటి ముఖ్యమైన సేవలు మినహా మిగతావి అన్నీ మూసివేయబడతాయని ఆయన చెప్పారు. ఇంతకుముందు ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో అమలులో ఉన్న అన్ని ఆంక్షలు ప్రస్తుత సమయంలో కూడా అమలులో ఉంటాయని అధికారులు చెప్తున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8,744 కొవిడ్-19 కేసులు నమోదుకాగా.. 9,068 మంది రికవరీ పొందారు. 22 మంది చనిపోయారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇప్పటివరకు, మహారాష్ట్రలో మొత్తం 22,28,471 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 97,637 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 52,500 మందిగా ఉన్నది.