తాండూరు : తాండూరులో నిర్వహించే గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో అధికారికంగా అనుమతులు తీసుకొని 226 వినాయకులు ప్రతిష్టించినట్లు తెలిపారు. తాండూరులో 14వ తేది మంగళవారం జరిగే సామూహిక వినాయక నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలని అందుకు పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందుకు 400మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పలు చోట్ల ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12గంటల నుంచి నిమజ్జనం ప్రారంభించాలని సూచించారు. ట్రాఫిక్లో వాహనాలు ఇరుక్కుపోకుండా కండిషన్ ఉన్న వాహనాల్లోనే వినాయకులను నిమజ్జనానికి తీసుకెళ్లాలన్నారు. డీజేలు, మైకులు, భారీ సౌండ్ బాక్సులకు అనుమతులు లేవన్నారు. మత్తు పానీయాలు తీసుకోకుండా పట్టణం, పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జన స్థలమైన కాగ్నానదికి చిన్నారులు వెల్లకూడదన్నారు. శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.
మున్సిపల్, విద్యుత్, ఆర్అడ్బీ, రెవెన్యూ సిబ్బంది తమతమ విధులను బాధ్యతతో పూర్తి చేయలన్నారు. అనంతరం పాత తాండూరు గడిలో శాంతియుతంగా ఉత్సవాలు జరిగేందుకు ఇరువర్గాల ప్రజలతో మాట్లాడారు. హిందూ, ముస్లింలు కలిసి నిమజ్జన ఉత్సవాలు జరుపుకునేలా ఒప్పందం తీసుకున్నారు. కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డి ఉన్నారు.