EAPCET | హైదరాబాద్, జనవరి 15( నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్సెట్ను(ఈఏపీ) ఉన్నత విద్యామండలి నిర్వహించనున్నది.
వీటితోపాటు మిగతా ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్స్)ల షెడ్యూల్ను సైతం వెల్లడించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటన విడుదల చేసింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు మొత్తం ఎంట్రెన్స్ టెస్టులను నిర్వహించనున్నారు. ఎప్సెట్ పరీక్షలను జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది. డిప్లొమా విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సెకండియర్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ను మే 12న నిర్వహించనుంది.