అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెన్త్క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం నిర్మిస్తున్నారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్ర టీజర్ను నిర్మాత సి.కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు విడుదలచేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ఒక్కరి వల్ల ఎప్పుడూ సక్సెస్ రాదు. సమిష్టిగా పనిచేసినప్పుడే విజయాల్ని అందుకోగలమని దాసరి నారాయణరావు చాలా సార్లు చెప్పారు. ఆ సమిష్టితత్వం చిత్రబృందంలో కనిపిస్తుంది. తెలుగులో అవికాగోర్కు సరైన గుర్తింపు రాలేదు. ఈ సినిమా ద్వారా ఆ లోటు తీరాలి. దర్శకుడు అంజి ప్రతి సీన్ను అద్భుతంగా తెరకెక్కించాడు’ అని తెలిపారు. వినాయక్, బి.గోపాల్ పంథాలో కమర్షియల్ ఎంటర్టైనర్గా అంజి ఈ సినిమాను రూపొందించారని ఛోటా కె నాయుడు అన్నారు. ‘ఛాయాగ్రాహకుడిగా నా 50వ సినిమా ఇది. దర్శకుడిగా మాత్రం ఇదే మొదటిది. అచ్యుత రామారావు చెప్పిన కథ నచ్చి దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించా. ‘96’, ‘నా ఆటోగ్రాఫ్’, ‘కొత్త బంగారులోకం’ మాదిరిగా నవ్యానుభూతిని పంచుతుంది’ అని ‘గరుడ వేగ’ అంజి పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నా నిజజీవితంలో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ కథ రాసుకున్నా. ప్రతి ఒక్కరికీ పదో తరగతి జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది’ అని చెప్పారు. పదో తరగతి చదువుతున్న సమయంలో నాకు ‘ఉయ్యాల జంపాలా’ సినిమాలో అవకాశమొచ్చిందని అవికాగోర్ పేర్కొన్నది.