న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనమేంటి.. మిగతా మతపరమైన నిర్మాణాలకు లేని రూల్స్ గుడులకే ఎందుకు.. ప్రభుత్వాల ఆజమాయిషీ నుంచి హిందూ దేవాలయాలను వెంటనే తప్పించాలి.. అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే బీజేపీ వాస్తవంలో ఇందుకు పూర్తి విరుద్ధమైన వైఖరి అవలంబిస్తున్నది. రామాలయం ఘనత మాదే.. అని చెప్పుకొనే ఆ పార్టీ బీహార్లో ఆలయాలపై పన్ను విధిస్తున్నది. హిందువులకు ప్రతినిధులం మేమే.. అని డంభాలు పలికే ఆ పార్టీ హిందువులు భక్తితో హుండీల్లో వేసే విరాళాలను ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకోవాలని చూస్తున్నది.
ఆలయాలు ప్రతీ ఏడు తమకు వచ్చే ఆదాయంలో 4% పన్నుగా చెల్లించాలని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన గుడులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గుడులు అంటే ఏమో అనుకోవచ్చు. ప్రజలు భక్తితో తమ సొంత స్థలంలో, ఇంటి ప్రాంగణంలో తమ డబ్బుతో నిర్మించుకొని పూజలు చేస్తున్న చిన్న చిన్న ఆలయాలను సైతం బీహార్లోని ఎన్డీయే సర్కారు వదిలిపెట్టకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ మత వ్యవహారాల బోర్డు దగ్గర రిజిస్టర్ కావాలని, ప్రతీ ఏడు వచ్చే ఆదాయంలో 4% పన్నుగా చెల్లించాలని బీహార్లోనీ ఎన్డీయే ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇప్పటిదాకా రిజిస్టర్ కానీ దేవాలయాల జాబితాను అందించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జాబితా వచ్చాక ప్రభుత్వమే నేరుగా వాటి రిజిస్ట్రేషన్ చేయనున్నది. అంటే దేవాలయాలు దరఖాస్తు చేసుకోకపోయినా.. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి పన్ను విధిస్తుందన్నమాట. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగలుల కాలంలో విధించిన ‘జిజియా పన్ను’తో దీనిని పోలుస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ కూడా ఖండించారు. బీహార్లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారం పంచుకుంటున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ(43) కంటే బీజేపీకే (74) అధిక సీట్లు వచ్చాయి. అయితే ముందస్తు ఒప్పందం మేరకు నితీశ్ కుమారే సీఎంగా బాధ్యతలు చేపట్టారు.