హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉత్తర గాలులు తెలంగాణ ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. పొద్దుగూకక ముందే చలిపెడుతున్నది. రాత్రి అయితే చాలు ప్రజలు రగ్గులు, గొంగళ్లు కప్పుకొన్నా ఇగంగాలి దూరుతున్నది. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తున్నది. రాష్ట్రంలో గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఉత్తర, ఈశాన్య చలిగాలులు చలి తీవ్రతను మరింత పెంచాయి. ఈ గాలుల తీవ్రతకు మూడురోజులుగా అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులు ఇదే తీవ్ర పరిస్థితి కొనసాగనున్నది. మూడు రోజుల్లో దాదాపు 25 జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని టీఎస్డీపీఎస్ ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. మిగతా జిల్లాల్లో కూడా15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం ఉదయం వరకు సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నది. వికారాబాద్ జిల్లాలో 8.1, రంగారెడ్డిలో 8.5, నాగర్ కర్నూల్లో 9.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 10 నుంచి 13 డిగ్రీల మధ్య రికార్డవడం గమనార్హం.
5 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోకి ఉత్తర శీతలగాలుల తీవ్రత ఇప్పుడే ప్రాంభమైందని, ఫిబ్రవరి మొదటివారం వరకు ఈ గాలులు కొనసాగుతాయని టీఎస్డీపీఎస్ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. మూడు రోజుల తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉష్ణోగ్రతలు పడిపోయి చలి బాగా పెరగడంతో జలుబు, దగ్గు, చలి జ్వరం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, సీజనల్ మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు, వాతావరణ నిపుణులు సూచించారు. ఉదయం నడకకు వెళ్లేవాళ్లు, వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు స్వెట్టర్లు వేసుకోవాలని, మఫ్లర్లు చుట్టుకోవాలని తెలిపారు. చలిగాలి చెవుల నుంచి శరీరం లోపలికి వెళ్లకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చలితో జాగ్రత్తగా ఉండాలన్నారు. చలికాలంలో తగిన దుస్తులు ధరించాలని, అత్యవసర సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని పేర్కొన్నారు. చేతులు వెచ్చగా ఉండేలా చేతి గ్లౌజ్లు ధరించాలని, క్రమం తప్పకుండా వేడి పానీయాలు తాగాలని తెలిపారు. వృద్ధులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.