హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖ నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డాక్టరేట్ అందుకున్నారు. ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూం ధాం) పాత్ర’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు మంగళవారం రసమయికి పీహెచ్డీ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. బాలకిషన్ జానపద అంశాలపై, కళారూపాలపై పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. రెండుసార్లు మానకొండూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, తెలుగు వర్సిటీ పూర్వవిద్యార్థి కావడం హర్షణీయమని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ పేర్కొన్నారు.