బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) ఎనిమిదో సీజన్ అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గతేడాది రద్దయిన పీకేఎల్ ఈసారి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బుధవారం మొదలైంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల్లేకుండా మొదలైన పీకేఎల్ పోరు రసవత్తరంగా సాగాయి. తొలి రోజు మూడు మ్యాచ్లు అభిమానులు అలరించాయి.
ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ గెలుపు ఖాతా తెరువలేకపోయింది. తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ 40-40 స్కోరుతో డ్రాగా ముగిసింది. కెప్టెన్ రోహిత్కుమార్ లేకుండానే పోటీకి దిగిన టైటాన్స్..అంతగా ఆకట్టుకోలేకపోయింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 రైడింగ్ పాయింట్లతో ఒంటరిపోరాటం చేసినా సహచరుల నుంచి సహకారం కరువైంది. మరోవైపు తమిళ్ తలైవాస్ తరఫున మంజీత్ 12 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే..మొదట్లో సిద్ధార్థ్ దేశాయ్, రజ్నీశ్ విజృంభణతో టైటాన్స్ కీలక పాయింట్లు దక్కించుకుంది. డిఫెండర్ సందీప్ కండోలా కూడా తలైవాస్ రైడర్లను ఒడిసిపట్టుకోవడంతో మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో తలైవాస్ ఆలౌటైంది. అయితే టైటాన్స్ దూకుడును సమర్థంగా నిలువరించే ప్రయత్నంలో తలైవాస్ సఫలమైంది.
మంజీత్ సూపర్ రైడింగ్కు తోడు డిఫెన్స్తో చెలరేగడంతో 18వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. దీంతో మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సరికి తలైవాస్ 23-21తో ఆధిక్యంలో నిలిచింది. కీలకమైన ద్వితీయార్ధంలో ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖర్లో సుర్జీత్సింగ్, సాహిల్సింగ్ డిఫెన్స్ తలైవాస్కు కలిసొచ్చింది. మ్యాచ్ ఆఖరి నిమిషంలో రైడింగ్కు వచ్చిన మంజీత్ను టైటాన్స్ పట్టుకోవడంతో మ్యాచ్ 40-40తో టైగా ముగిసింది. మిగతా మ్యాచ్ల విషయానికొస్తే యూ ముంబా 46-30 తేడాతో బెంగళూరు బుల్స్పై గెలువగా, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 38-33తో యూపీ యోధాపై గెలిచి అదిరిపోయే బోణీ కొట్టింది