జ్యేష్ఠ మాసపు తొలి రోజులు..కాకతీయ సామ్రాజ్యంలోని అనుమనగల్లు మండల ప్రధాన రహదారి.. యవనాశ్వంపై ఓ యువకుడు దిగాలుగా అటూఇటూ చూస్తూ వెళ్తున్నాడు.
మహోన్నత కాకతీయ సామ్రాజ్యం పతనమై.. ఢిల్లీ సుల్తానుల పాలనలో తెలుగునేల బావురుమంటూ విలపిస్తున్నకాలం. బాటకు అటూఇటూ విధ్వంసమై ఉన్న గుళ్లు, ఇళ్లు, భవనాలు! ఒకప్పుడు కళకళలాడగా చూసిన జన్మభూమి.. ఇప్పుడు సౌభాగ్యాన్ని కోల్పోయిన తల్లిలా కాంతివిహీనంగా కనిపిస్తుంటే.. దిగాలుగా చూస్తున్నాడు. ఓ సాధారణ యువరైతు ఆహార్యంతో ఉన్నాడతను. ఓ సత్రం వద్ద ఆగి.. లోపలికి నడిచాడు. లోపల దాదాపు పాతికమంది.. మెల్లగా కబుర్లు చెప్పుకొంటూ, అటూ ఇటూ చూసుకుంటూ తింటున్నారు. అందరిలోనూ సన్నని భయవిహల్వత.. ఎవరో పరాయిమనిషి తమను చూస్తున్నట్లు.. ఇప్పుడో రేపో తమను తిడతాడో.. కొడతాడో.. చంపుతాడో అన్నట్లు!
సత్రం నిర్వాహకురాలి దగ్గరికి వెళ్లి..“అమ్మా.. తినడానికి ఏమైనా ఉన్నదా?” అన్నాడు ఆ ఆశ్వికుడు.కుండలోని అటుకులను ఓ పళ్లెరంలో పోసి.. బెల్లం ముక్క తీసి ఆశ్వికుని చేతికి అందించిందామె.అప్పుడే గుమ్మం వద్ద ఓ పెద్ద కదలిక వినిపించింది. అందరూ చటుక్కున అటే చూశారు. ఓ పదిమంది ఆగంతకులు. తెలుగుప్రాంతీయులు కాదు.
భారీ శరీరాలతో.. చేతుల్లో గండ్రగొడ్డళ్లు, బరిసెలు, ఇనుపతీగె చుట్టిన దుడ్డుకట్టెలు! చూపుల్లో దుర్మార్గం. కదలికల్లో అధికారం.. క్రౌర్యం!!
అరుస్తూ.. తోసుకుంటూ లోపలికి వచ్చారు. ఒకడు ధాటిగా ఆ ఆశ్వికుడి వద్దకు వెళ్లి.. అప్పుడే అందుకున్న అటుకుల పళ్లెరాన్ని వేగంగా పైకి విసిరికొట్టాడు.
“అన్నన్నన్నా.. ఆకలిగా ఉందన్నా!” అంటూ, చటుక్కున ఆ పళ్లెరాన్ని మళ్లీ లాక్కున్నాడు ఆశ్వికుడు.
ఆ తురుష్కుడికి కోపం హెచ్చింది. ఆశ్వికుడి చేతిలోని పళ్లెరాన్ని లాగి వేగంగా పైకి విసిరికొట్టాడు.తురుష్కులంతా ఆశ్వికుని చుట్టుముట్టి ఉరిమురిమి చూశారు. ఆశ్వికుని కుడిచెయ్యి అప్రయత్నంగా నడుమువద్దకు పోయింది. అక్కడ చురకత్తి లేదు. వెంటనే కాస్త తగ్గాడు. రేకపల్లిలో బయల్దేరుతున్నప్పుడు అన్న ప్రోలయనాయకుడు చెప్పాడు..
‘లక్ష్యం సాధించాలంటే.. ఓరిమి అవసరం! ఎంత యుద్ధవీరుడివి అయినా.. ఎదురైన ప్రతివాడితోనూ ఘర్షణకు దిగకు. అందుకే చురకత్తి కూడా లేకుండా వెళ్లమని చెప్తున్నాను. అనుమనగల్లు మండలం పొలిమేరలో మనవాళ్లు నీ కోసం ఉంటారు. వాళ్లతో కలిసి నీ భవిష్యత్ కార్యకలాపాలు ప్రారంభించు!’..
మరి యోజనదూరంలో అనుమనగల్లు మండలం సమీపిస్తుంది. భయపడినట్లే ఈ సత్రం వద్ద వీళ్ల చేతుల్లో చిక్కాడు.
ఎలా తప్పించుకోవాలి?! చటుక్కున మోకాళ్లపై కిందకూర్చుని పైకిచూస్తూ చేతులు జోడించాడు.ఆ అమాయక గ్రామీణ యువకుణ్ని ఇబ్బంది పెడుతున్న ఆ బృందం.. తమను మరో ఆశ్వికబృందం చుట్టుముట్టేవరకూ గుర్తించలేకపోయింది. దాదాపు యాభైమంది రైతుల దుస్తుల్లో ఉన్న ఆశ్వికులు అత్యంత వేగంగా పైకి వచ్చిపడ్డారు. అందినవాడినల్లా కర్కశంగా, పాశవికంగా తరుముతూ.. ఆ గ్రామీణ ఆశ్వికుణ్ని ఎత్తి మరో అశ్వంపై కూర్చుండబెట్టుకుని.. రెప్పపాటు కాలంలో అదృశ్యమైపోయారు.
మరో జాముకు ఆశ్వికునితో ఆ రైతుబృందం సుల్తాన్పూర్ (ఓరుగల్లు)కు కూతవేటు దూరంలోని దట్టమైన అడవుల్లో ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి చేరుకుంది. ఆ ఆశ్వికుడు కాపయనాయకుడు. ఇటీవలే రేకపల్లి రాజధానిగా స్వతంత్ర తీరస్థ ఆంధ్రరాజ్యాన్ని స్థాపించిన ప్రోలయనాయకునికి తమ్ముడు. పినతండ్రి దేవయనాయకుని కుమారుడు. పిల్లలులేని ప్రోలయనాయకునికి వారసుడు. ఓరుగల్లులో పుట్టి పెరిగి.. గొప్ప కాకతీయవీరునిగా గుర్తింపు ఉన్న ముప్పై ఐదేళ్ల యువ మహాయోధుడు. ఆశ్వికబృందానికి నాయకత్వం వహించినవాడు.. అనుమనగల్లు వీరుడు అభివల్లయ.
క్రీ.శ.1330 వ సంవత్సరం. జ్యేష్ఠ మాసం.
ఏడుసార్లు ఓరుగల్లుపై దాడిచేసి చివరికి ఏడేళ్ల కింద (క్రీ.శ. 1323) ఆంధ్ర సామ్రాజ్యాధినేత, కాకతీయ మహాచక్రవర్తి ప్రతాపరుద్రుణ్ని ఓడించి.. ఓరుగల్లును సుల్తాన్పూర్గా పేరు మార్చి.. తురకరాజ్యాన్ని ప్రారంభించాడు ఢిల్లీ సుల్తాన్ మహమ్ముద్ బిన్ తుగ్లక్.జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఆంధ్రసామ్రాజ్యం.. ఢిల్లీ సుల్తానుల దాడులతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ప్రతాపరుద్రుని వీరమరణవార్త ఆంధ్ర రాజ్యాన్ని కుదిపేసింది. ఏమవుతున్నదో తెలిసేలోగా.. జనజీవనం అస్తవ్యస్తమై, సర్వనాశనం మొదలయ్యింది. ఏదో ఓ పురంలో.. ఓ వీధిలోకి ఓ ముష్కరుల ముఠా వచ్చి పడుతుంది. వీధుల్లో ఉన్న ఆవులు, గేదెలు, గుర్రాలను తోలుకుపోతారు. ఇళ్లలోకి చొరబడతారు. నగానట్రా గుంజుకుంటారు. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. మగవాళ్లు ఏమైనా అంటే.. వాళ్లముందే ఆ స్త్రీలను మానభంగం చేస్తారు. ఆనక చంపేస్తారు. ఈ దుష్కృత్యాలను చేస్తున్నవాళ్లు ఈ రాజ్యపాలకులే అంటే ఎంత దౌర్భాగ్యం?!
రాజధాని ఓరుగల్లు నుంచి అట్టడుగు పట్టణం కంచివరకు.. సమస్త ఆంధ్ర రాజ్యమంతటా ఇదే అరాచకం!
ఆంధ్రసామ్రాజ్యం విషాదవిహ్వలతతో చిగురుటాకులా వణికిపోతుండగా.. ముందు మేల్కొన్నవాడు కాకతీయ మహాప్రధాని కొలని రుద్రదేవుడు. ఏడేళ్ల యుద్ధాలలో ప్రముఖులంతా నేలకొరగగా.. మిగిలిన పాతికమంది వీరసేనానులతో మిత్రసమాఖ్య ఏర్పాటుచేశాడు.
ఇందులో అన్నయ మంత్రి, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమనీడు పెద్దలు కాగా.. మిగిలిన వారు వారివారి ప్రాంతాలలో మండలేశ్వరులు, నాయంకరులు. తురుష్కులపై పోరాటానికి, ఆంధ్రరాజ్య ప్రజల మాన, ప్రాణ రక్షణకు తమ ప్రాణాలు ధారపోయడానికి సిద్ధమైన యోధానుయోధులు. కాకతీయవంశం అంతరించగానే ఆంధ్రసామ్రాజ్యం చిన్నచిన్నరాజ్యాలుగా విడిపోయింది. సమాఖ్య మిత్రులు ఒకరికొకరు సహకరించుకోగా.. మొహమ్మద్ అనే తురక సర్దార్ను వెళ్లగొట్టి, కంచినుంచి నెల్లూరు వరకు ఉన్న మొరసునాడు ప్రాంతాన్ని ఆరవీడు నాయంకరుడు సోమదేవరాజు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. గుంటూరు, సింహపురి ప్రాంతాలను జయించి అద్దంకి రాజధానిగా రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు ప్రోలయ వేమారెడ్డి. ముసునూరు వంశజుడు ప్రోలయనాయకుడు తీరస్తప్రాంతాన్ని రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యం ఏర్పరిచాడు.
ఇక మిగిలింది సుల్తాన్పూర్ (ఓరుగల్లు) రాజధానిగా ఉన్న ప్రధాన ప్రాంతం. దానినే ఢిల్లీ పాలకులు, స్థానిక తురకలు తెలింగ లేదా త్రిలింగరాజ్యంగా పిలుస్తుండగా.. సాధారణ ప్రజల నోళ్లలో ఈపేరు తెలింగాణ – తెలింగాణా రాజ్యంగా స్థిరపడింది.
ఆ మూడు ప్రత్యేకరాజ్యాల స్థాపనలో కాపయ నాయకుడు పాల్గొన్నాడు. అందరికీ అతని వీరత్వం, యుద్ధ నైపుణ్యం, మంత్రాంగ పరిణతి నచ్చాయి. ఓరుగల్లు విముక్తికి అతనే సరైన సైన్యాధ్యక్షుడుగా అందరూ నిర్ణయించారు.“ఆంధ్రప్రాంతాలలోని తురక సర్దారులంతా ఇప్పుడు ఓరుగల్లు చేరారు. ప్రజలను చిత్రవధ చేస్తున్నారు. వెళ్లు.. వెళ్లి అక్కడి మనమిత్రులతో చర్చించి విముక్తి ప్రణాళిక సిద్ధంచెయ్యి. ఓరుగల్లును నువ్వే విముక్తం చెయ్యగలవు. నీ వెనక మేము సదా సన్నద్ధంగా ఉంటాం!” అన్నారు మిత్ర సమాఖ్య సభ్యులు.ఓరుగల్లు విముక్తి కోసం రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ మండల సేనాబృందాలను కలిశాడు కాపయ. “తెలింగాణ రాజ్యం కూడా ఢిల్లీ పాలకుల నుంచి విముక్తమై.. పూర్తి హిందూరాజ్యం కావాలి. ఈ వినాశనం ఇక్కడితో ఆగాలి. అందుకు ఏ పోరాటానికైనా నేను సిద్ధం!” అన్నాడు కాపయ. విచిత్రంగా కొద్దిమంది మాత్రమే చేతులు కలిపారు.“వాళ్లతో నెగ్గడం కష్టం. కొంతకాలం రహస్య జీవనమే ఉత్తమం..” అన్నారు చాలామంది. నోరెళ్లబెట్టాడు కాపయ. ఇక్కడ మారణకాండ ఎంత తీవ్రంగా ఉందో.. వీరయోధులూ ఈ కిరాతకుల ధాటికి ఎలా పిరికి మంత్రం జపిస్తున్నారో అర్థం చేసుకున్నాడు.
ఓరుగల్లు పట్టణంలోని భోగేశ్వరాలయం.. ఒకప్పుడు కిక్కిరిసిన భక్తులతో ‘హరోంహర!’ నినాదాలతో దేవదేవుడే కొలువైనట్లుండే ఆ దేవళం.. ఇప్పుడు పూర్తిగా ధ్వంసమై రాళ్లకుప్పలా మిగిలిఉంది. తన సైనిక పటాలంతో కలిసి దేవళం వద్దకు వచ్చాడు సుల్తాన్పూర్ నగర సహాయ దండనాయకుడు తుర్రేఖాన్. ఓ ఎనుబోతును చంపి.. అక్కడే పచ్చి మాంసాన్ని తింటున్నారు ఆ సైనిక పటాలమంతా. అప్పుడు జరిగింది వాళ్లు ఊహించని మెరుపుదాడి..
కాపయ నాయకత్వంలో ఓ పెద్ద ఆశ్వికబృందం హఠాత్తుగా దాడి చేసింది. చేతిలో జంతుమాంసం ఉన్న సైనికులకు ఆయుధం పట్టుకునే అవకాశం ఇవ్వకుండా.. ఆశ్వికులు దాడి చేశారు. కత్తులు, బల్లాలు, గండ్రగొడ్డళ్లతో విరుచుకుపడి అందర్నీ నరికిపారేశారు. తుర్రేఖాన్ శిరసును ఒక్క ఖడ్గ ప్రహారంతో ఖండించిన కాపయ.. ఆ మ్లేచ్ఛుడి రక్తంతో భోగేశ్వర దేవరను అభిషేకించాడు. ఈ సంఘటన ఢిల్లీ పాలకులను నిబిడాశ్చర్యంలో ముంచింది. ఓరుగల్లులో ప్రవేశించిన ఆరుమాసాలకు కాపయ తన తొలిదెబ్బ రుచిచూపాడు. అతని సారథ్యంపై సందేహమున్న సాటి నాయంకర బృందాలకు తన అసాధారణ ప్రజ్ఞ చూపాడు.
మరో మూడుమాసాలు గడిచాక..
ఓరోజు అనుమకొండ వేశ్యావాటిక ముందు విటుడిగా ముస్తాబై పోతున్నాడు కాపయ. ఎవరి కోసమో నిశితంగా వెతుకుతున్నాడు.
“రండి బావగారూ! కుడికాలు పెట్టండి..” అన్నాడొక పేడిమూతి యువకుడు.. కాపయతో, ఓ వేశ్యా మందిరం వద్ద.
అతని వైపు దగ్గరగా జరిగి.. “నాకు ఇష్టమైన నామం పున్నగి. ఆ పేరుతో ఎవరైనా ఉంటే.. ఏర్పాటు చెయ్యగలవా?”.
‘పున్నగి’ పేరు వినగానే ఆ యువకుడు నిటారుగా మారి.. కాపయ వంక చురుగ్గా చూశాడు.
“మీరు.. తమరు!?”.
“ముందు పున్నగిని చూడాలి!”.
“కాస్త ముందుకుపోయి.. ఆ కుడి పక్క ఇంట్లోకి వెళ్లండి. ఎవరైనా చూస్తే ప్రమాదం!” అన్నాడు ఆ యువకుడు.
అలాగే ఆ ఇంట్లోకి వెళ్లాడు కాపయ. అక్కడో యువతి. ఆమె కాపయను చూసి ఆశ్చర్యపోతూ..
“మీరు కాపయ నాయకులవారు కదూ!?” అన్నది.
“నేనే పున్నగీ..” అన్నాడు కాపయ తలవూపి.
ఆమె అతని కాళ్లపై పడిపోయి భోరున ఏడవడం ప్రారంభించింది. లేపి అర్ధ పల్యంకంపై కూర్చోబెట్టాడు.
“గొప్ప వీరయోధురాలివి. ఇలా వేశ్యగా మారావేమిటని నిన్ను ప్రశ్నించడం లేదు పున్నగి. తెలుగు సమాజం ఎప్పుడూ చూడనంత తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. శోకం నియంత్రణలో ఉండాలి. దుఃఖం.. శత్రువులపై పగగా మారాలి. అప్పుడే శత్రువును నిర్మూలించగలం!”.
కాపయ అనునయ వాక్యాలతో కాస్త తెప్పరిల్లి..
“ఓరుగల్లులో మా బతుకులు కుక్కలకన్నా హీనం. యోధుడు, సైనికుడంటే చాలు.. పెడరెక్కలు విరిచికట్టి కింద మంట పెట్టడం సర్వసాధారణం. ఇక మహిళాయోధురాలు అంటే.. ఈ మ్లేచ్ఛులకు అస్సలు పడదు. నా మహిళా దళాన్ని ఊచకొత కోసి.. మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మా భర్తలను మతం మార్పించి.. మాకు తలాక్ చెప్పించి, వాళ్లను బానిసలుగా ఢిల్లీకి తీసుకెళ్లారు. చివరికి తిండిలేక.. బతికే మార్గంలేక ఈ వేశ్యవాడలో ఇలా!” అని చెప్పుకొచ్చిందామె.
ఖిన్నుడై వంచిన తల ఎత్తలేకపోయాడు కాపయ.
రుద్రమదేవి తన కాకతీయ సైన్యంలో ఏర్పాటు చేసిన మహిళాదళం నాయకురాలు పున్నగి. ఆమె మనుమరాలే ఈ పున్నగి. కాపయలాంటి యోధులతో సమానమైన యుద్ధ ప్రవీణురాలు.
“సరే.. సరే! ముందు నీ మహిళాదళాన్ని తిరిగి సంఘటితం చెయ్యి. మనకు రెండు మహిళాదళాలు కావాలి. మీకు కావాల్సిన ఆర్థిక, రక్షణ సదుపాయాలు నేను ఏర్పాటు చేస్తాను. తర్వాతి ప్రణాళిక అప్పుడు ఆలోచిద్దాం!”.
అప్పుడే ఇద్దరు స్త్రీలు ఆ ఇంట్లోకి ప్రవేశించారు.
“ఈమె చందల. ఆమె వల్లిక” అంటూ, వారిని పరిచయం చేసింది పున్నగి.అవయవ సౌష్టవం కలిగిన అందాలరాశి చందల. దగ్గరగా వెళ్లి నుదుటనున్న కుంకుమను తుడిచివేశాడు. అందరూ మ్రాన్పడిపోయి చూస్తుండగా..
“నువ్వు ఢిల్లీ వెళ్లి తిరిగి రావాలి చందల.. పర్షియా సుందరిగా!” అన్నాడు కాపయ.లిప్తకాలం తర్వాత అర్థమై.. అందరూ నిట్టూర్పు విడిచారు. అందంగా నవ్వి.. ‘సలాం!’ అంటూ అభివాదం చేసింది చందల. అనేకమంది తురక విటులను దగ్గరగా చూసిన అనుభవజ్ఞురాలు చందల. ఆమెతోపాటు వచ్చిన వల్లికతో చర్చించి ఆమె చేయాల్సిన కార్యకలాపం వివరించాడు కాపయ.
దాదాపు మూడేళ్లపాటు తెలింగాణ రాజ్యంలోని అనుకూలురను, తురకలంటే హడలిపోతున్న యోధులను పోరాటానికి సమాయత్తం చేశాడు కాపయ. పున్నగి మహిళా యుద్ధదళం కూడా పోరాటానికి సంసిద్ధమైంది. వల్లిక నాయకత్వంలో గణికల బృందం పౌరసమాజాన్ని పోరాటానికి సిద్ధం చేస్తున్నది. ఇక యుద్ధ శంఖారావానికి సన్నాహాలు ముమ్మరంచేశాడు కాపయ. అతనిపై నమ్మకం పెరిగి.. సమస్త తెలింగాణ యుద్ధ సంసిద్ధమయ్యింది.
మరోవైపు దక్షిణావర్తానికి మరోసారి వచ్చిన ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్.. మిగిలిన కాకతీయ రాజ్యాన్ని మరో రెండుభాగాలుగా విభజించాడు. భద్రకోట (బీదరు) రాజధానిగా.. షిహాబ్ సుల్తాన్ను వజీర్గా నియమించి, పశ్చిమ తెలింగాణగా ప్రకటించాడు. మిగిలిన తూర్పు తెలింగాణకు సుల్తాన్పూర్ (ఓరుగల్లు) రాజధానిగా.. మాలిక్ మక్బూల్ను వజీర్గా ప్రకటించి ఢిల్లీ వెళ్లిపోయాడు. మతంమారిన కాకతీయ యోధుడు గన్నమ నాయుడే.. ఈ మాలిక్ మక్బూల్. ప్రతాపరుద్రుని పాలనలో ఓరుగల్లు కటకపాలకుడైన గన్నమ.. బలవంతంగా మతం మారాడు. ఓరుగల్లులోని దేవళాలను పడగొట్టి.. తుగ్లక్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందాడు. ఇప్పుడు ఓరుగల్లు పాలకుడిగా వచ్చాడు. గన్నమ గురించి కాపయకు, కాపయ శౌర్య వీరత్వం గురించి గన్నమకు క్షుణ్నంగా తెలుసు.
తెలింగాణ మండలేశ్వరులు, నాయంకరులు.. తమ సేనలతో చావోరేవో తేల్చుకోడానికి కాపయ నాయకత్వంలో యుద్ధ సన్నద్ధతలో ఉన్నారు. అటు మిత్రసమాఖ్య సేనలూ సిద్ధమని తెలియజేశాయి.రాజ్యమంతా.. పైకి ప్రశాంతంగా ఉంది. ఎక్కడా యుద్ధ వాతావరణం కనిపించడం లేదు. ఆ సమయంలోనే.. కాపయ యుద్ధ శిబిరానికి ఓ వార్త అందించింది పున్నగి. అభివల్లయను రాజప్రాసాదంలో బంధించారన్నది ఆ వార్త సారాంశం.
ఓరుగల్లు రాజప్రాసాదం. విభిన్న వస్తువులు రాజప్రాసాదానికి అందించే తురకవ్యాపారి రూపంలో తన అశ్వశకటంతో రాజప్రాసాదం లోపలికి ప్రవేశించి.. ప్రధానద్వారం వద్ద శకటాన్ని నిలిపాడు కాపయ. రాజప్రాసాదం లోపల ఎందరో కాపయ అనుయాయులు ఉన్నారు. కొందరు వేగులవాళ్లు అతనికి అండగా నీడల్లా కదలుతున్నారు.
ఒకప్పుడు అద్భుతమైన రసరాజ్యంలా కళకళలాడిన కాకతీయ చక్రవర్తుల నివాసమైన ఆ రాజప్రాసాదం.. ఇప్పుడు నుదుట కుంకుమ కోల్పోయిన భార్యలా కళావిహీనమై పరమ అసహ్యంగా కనిపిస్తున్నది. ఆ రాజభవనాన్ని మానసికవేదనతో చూస్తూ లోపలికి వెళ్లి.. రాజప్రాసాద కొట్టారువు రుహుల్లాఖాన్కు అభివాదం చేశాడు. ఆయన సహాయకులు శకటంలోని వస్తువులను దించుకోసాగారు. కాపయ మౌనంగా ప్రాసాదం లోపలికి వెళ్తున్నాడు. ముందు బురఖాలోనున్న ఓ పరిచారిక అతనికి దారి చూపుతున్నదని ఎవ్వరికీ అనుమానం రావడంలేదు. మెల్లగా ఆమె చూపినవైపు మునికాళ్లపై నడుస్తూ లోలోపలికి వెళ్లాడు. అదొక చిన్న నడవా.. ఎదురుగా ఓ రాచమందిరం. మెల్లిగా ఆ మందిరం తలుపు తోశాడు. ఎదురుగా సింహాసనం లాంటి పల్యంకంపై విలాసంగా కూర్చుని మందహాసంతో చూస్తున్న ఓ ముస్లిం రాచయువతి!!
“స్వాగతం కాపయ నాయకులకు!!”..
ఓరుగల్లు రాజప్రాసాదపు ప్రధాన మహాద్వారం..
దాని ముందు.. శరీరమంతా తోలువలిచి తీసేసిన నగ్నశవం పడి ఉంది. చుట్టూ మూగి చోద్యం చూస్తున్నారు పురజనులు. అది ఓరుగల్లు రాజప్రాసాద దండనాయకుడు ఉనాయద్ ఖాన్ శవం.కాసేపటికి సాక్షాత్తూ ఓరుగల్లు పాలకుడు వజీర్ మాలిక్ మక్బూల్ ముఖ్యసేనానులతో, ప్రధానులతో తరలివచ్చాడు. ఉనాయద్ ఖాన్ను అత్యంత దారుణంగా బతికుండగానే చర్మం వలిచి చంపి రాజప్రాసాదం ముందు పడేయడం.. చిన్నవిషయం కాదు. రాజప్రాసాదంలో శత్రు గూఢచారులు ఉన్నారు. ఢిల్లీ పాలకుల హింసాప్రవృత్తి పట్ల ఏమాత్రం భయపడని కాకతీయవీరులు రాజప్రాసాదంలోనే తిష్ఠవేశారు.
మక్బూల్ లేచాడు.
“ఈ ఘోరం చేసినవాళ్లెవరో.. వాళ్లకు సహకరించిన వాళ్లెవరో.. రాజప్రాసాదంలోఉన్న కాఫిర్లు ఎవ్వరో.. అందర్నీ విచక్షణారహితంగా నరికివేయండి!”..
వజీర్ మాలిక్ మక్బూల్ ఈ ప్రకటనచేసే సమయానికి కొరవి అడవుల్లోని తమ రహస్యశిబిరంలో కాపయ బృందం పండుగ చేసుకుంటున్నారు.
ఆరోజు రాజప్రాసాదంలో కాపయ ప్రవేశించిన శయనమందిరం వజీర్ సుల్తాన్ మక్బూల్ ప్రియురాలు నూర్జహాన్ది. ‘కాపయ నాయకులవారికి స్వాగతం!’ అంటూ అభివాదం చేసింది.. నూర్జహాన్గా చలామణి అవుతున్న కాకతీయ వీరవనిత చందల. ఆశ్చర్యపోయిన కాపయ తలతిప్పిచూస్తే.. ఆవలగా మరో బల్లవద్ద తాపీగా విందు ఆరగిస్తున్నాడు అభివల్లయ.
“అరె! చందల ఢిల్లీనుంచి వచ్చి రాజభవనంలో విజయవంతంగా తిష్ఠ వేసిందని పున్నగి చెప్పలేదే!” అన్నాడు ఆనందంగా కాపయ.
మక్బూల్గా మారిన గన్నమతో ఆమెకు ముందునుండే బాంధవ్యం ఉంది. మక్బూల్ ఓరుగల్లుకు వజీర్ కావడంతో.. నూర్జహాన్గా మారిన చందలకు యుద్ధతంత్రాలన్నీ ముందే తెలిసిపోతున్నాయి. అభివల్లయను బంధించి తోలువలిచి చంపి.. కాపయబృందాలను బెదరకొట్టాలని మక్బూల్ పథకం వేశాడు. ఇది చందలకు ముందే తెలిసింది. అభివల్లయను బందిఖానా నుంచి తప్పించి తన మందిరంలోనే దాచింది. పున్నగికి వార్త అందించింది. గెరిల్లా యోధులంతా జరిగింది విని.. కాపయ, అభివల్లయలను అభినందించసాగారు.
అప్పుడే వచ్చిన వార్తాహరుడు వగరుస్తూ..“నాయకా దుర్వార్త! ఆ దుర్మార్గులు చందలను గుర్తించారు. ఆమెను తొమ్మిది ఖండాలుగా నరికి రాజప్రసాద తొమ్మిదిద్వారాలకు వేలాడదీశారు. రాజప్రాసాదంలోని మనవాళ్లను వెతికివెతికి చంపుతున్నారు!”.మరికాసేపటికి గుర్రాలు లేపిన దుమ్ము అక్కడంతా కమ్ముకుంది.
యుద్ధం మొదలయ్యింది. కాపయ సైన్యం, మిత్రసమాఖ్య సైన్యాలు ఏకమై ఓరుగల్లు విముక్తికి తీవ్రంగా పోరాడుతున్నాయి. బయట సైనికయుద్ధమే కాదు.. రాజప్రాసాదంలో, ఓరుగల్లు నగరంలో, గ్రామాల్లో.. తెలింగాణ రాజ్యమంతటా ప్రజలు చేతికి దొరికిన ఆయుధాలతో తిరగబడ్డారు. ఢిల్లీ పాలకులు, వారి అధికారులు.. అందర్నీ వెంటపడి తరమసాగారు.పాలకులపై అసహ్యం నరనరాన నిండిపోయిన సమస్త తెలింగాణ ప్రజానీకం, ఆంధ్రరాజ్యాల సైన్యాలు ఓరుగల్లు విముక్తి కోసం దాదాపు ఆరునెలలు ‘విజయమో వీరస్వర్గమో!’ అన్నట్లు తీవ్రపోరాటం చేసి.. విజయం సాధించాయి. ఈ యుద్ధానికి నాయకత్వం వహించి, అన్నివైపులా యుద్ధతంత్రాలు నడిపి, తిరుగులేని పోరాటపటిమతో ఓరుగల్లును విముక్తం చేసిన మహాయోధుడు.. కాపయనాయకుడు!
రాజప్రాసాదం.. ఓరుగల్లు నగరం పూర్తిగా కాపయసైన్యం వశమయ్యాయి. ఓరుగల్లు ప్రజల జయజయధ్వానాల మధ్య మహిళా యుద్ధపటాలం నాయకురాలు పున్నగి.. రాజప్రాసాదం పైకెళ్లి తిరిగి కాకతీయకేతనం ఎగుర వేసింది. కానీ, కాకతీయ కేతన రెపరెపలు రెండురోజులు మాత్రమే ఉన్నాయి.
మూడోరోజు నుంచి ముసునూరు కేతనం రెపరెపలాడింది. కారణం.. ఇప్పుడు అక్కడ కాకతీయవంశ వారసులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు. దాంతో మిత్రసమాఖ్య ఏకగ్రీవ నిర్ణయంతో ముసునూరి వంశ కేతనం ఎగరేశారు. కాపయ నాయకత్వాన తెలుగువారి కొత్తరాజ్యం తిరిగి ప్రారంభమైంది. కాకతీయ సామ్రాజ్యం అంతమయ్యాక.. ఏడేళ్లపాటు వీరోచితంగా పోరాడి, తురుష్కులను పారద్రోలినా తిరిగి ఆంధ్ర సామ్రాజ్యం ఏర్పడలేదు. కాకతీయ సామ్రాజ్యం వేరువేరు రాజ్యాలుగా స్వతంత్రమవుతూ.. ఆఖరున ఓరుగల్లును విముక్తం చేశాక, ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న ఓరుగల్లు ప్రాంతాన్ని..
తెలింగాణ రాజ్యంగా పిలవడం మొదలైంది.
మత్తి భానుమూర్తి
తెలుగువారి చారిత్రక జనజీవితాన్ని మొత్తంగా సప్రమాణ గ్రంథరూపంలోకి తేవాలన్న జీవితాశయంతో రచనలు చేస్తున్నారు మత్తి భానుమూర్తి. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేస్తూ.. థియేటర్ ఆర్ట్స్లో నటన, దర్శకత్వంలో డిప్లొమా చేశారు. ఈనాడు దినపత్రికలో రెండేళ్లు పనిచేశారు. స్టేట్ బ్యాంక్లో 40 ఏళ్లు ఉద్యోగం చేశారు. ఆ తరవాత చరిత్ర రచనలోకి వచ్చారు. జాయసేనాపతి సీరియల్ నవల ద్వారా ‘నమస్తే తెలంగాణ’ పాఠకులను వారంవారం పలుకరిస్తున్నారు. కథలు రాసింది తక్కువే! అయినప్పటికీ.. అవన్నీ పాఠకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే! యండమూరి వీరేంద్రనాథ్లో కలిసి ఓ నవల కూడా రాశారు. నాటికలు, రేడియో, టీవీ, సినిమాలకూ పనిచేశారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు
ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన
‘కథల పోటీ-2022’లో రూ.3 వేల
బహుమతి పొందిన కథ.