సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ/దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, జనవరి 25 : అర్హ్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించేందుకు 58,59 జీవోలను అవసరమైతే అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో లక్ష ఇళ్ల స్థలాల పట్టాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.499.96 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో మంత్రి ప్రసంగించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.
ఇతర రాష్ట్రాలతోపాటు ఇతర జిల్లాల నుంచి ఉపాధి, విద్య అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారని, రీజనల్ రింగు రోడ్డు వస్తున్న నేపథ్యంలో ఔటర్ వెలుపల అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2051 సంవత్సర జనాభా అవసరాలకు తగినట్లు మౌలిక వసతులు పెంచుతామని చెప్పారు. ఇప్పటివరకు రూ.2800 కోట్లు తాగునీటికి ఖర్చు చేశామని, మరో రూ.1200 కోట్లతో మిగిలిపోయిన ప్రాంతాలకు తాగునీటిని అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 600 ఎంఎల్డీల నీటిని అందిస్తుండగా, రాబోయే 2051 నాటికి మరో 400 ఎంఎల్డీల నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కృష్ణా నీటి కోసం సుంకిశాల వద్ద రూ.1400 కోట్లతో రెండోపైపులైన్ చేపట్టనున్నట్లు, గోదావరి నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్ గ్రావిటీ ద్వారా తీసుకొస్తున్నామని వివరించారు. ఔటర్ లోపలి గృహాల నుంచి రోజుకు 2 కోట్ల లీటర్ల మురుగునీరు విడుదలవుతుండగా, శుద్ధి చేసేందుకు రూ.3866 కోట్లతో 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న జనాభాకు తగినట్లు వసతులు
హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని, జనాభా పెరుగుతున్నందున మౌలిక వసతులను పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి వెల్లడించారు. గత టర్మ్లో రూ.2వేల కోట్లతో జీహెచ్ఎంసీ విలీన ప్రాంతాల్లో, సుమారు రూ.800 కోట్లతో ఔటర్ లోపలి పలు గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఔటర్ లోపల ఉన్న దాదాపు వెయ్యి గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు కూడా నీటిని సరఫరా చేసేందుకు రూ.1200 కోట్లతో మంచినీటి వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. నగరంలో నిత్యం 2 వేల మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోందని, ఈ మొత్తం మురుగును శుద్ధి చేసిన తర్వాతే నాలాలు, చెరువుల్లోకి వెళ్లాలనే ఆలోచనతో రూ.3866 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పేరొన్నారు. బాచుపల్లి చౌరస్తాలో నిర్మిస్తున్న వంతెనకు అదనంగా మరో రూ.30 కోట్లు మంజూరు చేస్తామని, కేంద్రం సహకరించక పోయినా రూ.400 కోట్లు వెచ్చించి సుచిత్ర చౌరస్తా వద్ద ైప్లెఓవర్ నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఐదు ఎస్టీపీల వివరాలు
రూ.3866 కోట్లతో చేపట్టిన 31 కొత్త ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టులోని ప్యాకేజ్ -3 పనులకు కుత్బుల్లాపూర్లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కుత్బుల్లాపూర్ సరిల్ పరిధిలో ప్యాకేజీ -3లో రూ.248.44 కోట్లతో 5 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం జరగనుంది. వీటి మొత్తం సామర్థ్యం 66 ఎంఎల్డీలు కాగా ఫాక్స్ సాగర్, వెన్నెలగడ్డ, గాయత్రినగర్, పరికిచెరువు, శివాలయనగర్ ప్రాంతాల్లో నూతన ఎస్టీపీలను నిర్మించనున్నారు.
ఆటలాడి ఉత్సాహం
ఆయా కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ను కలిసేందుకు స్థానిక నాయకులు పోటీపడ్డారు. కొద్దిసేపు బాస్కెట్బాల్ ఆడారు. కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజుతో క్రికెట్ ఆడి నాయకుల్లో ఉత్సాహం నింపారు.స్కేటింగ్ చేసే చిన్నారులతో ఫొటోలు దిగారు.
ఫ్యాక్స్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో వరద కష్టాలకు చెక్
పేట్ బషీరాబాద్లోని గంగా ఎన్క్లేవ్ వద్ద రూ.95 కోట్లతో ఫాక్స్సాగర్, కోల్కాలువ, కెమికల్ కాలువ, తూము కాలువ అభివృద్ధి పనులు, దాదాపు రూ.95 కోట్లతో ఫాక్స్సాగర్, వెన్నెలగడ్డ చెరువులో మురుగునీటి కాల్వ శుద్ధీకరణ కేంద్రాల పనులు ప్రారంభమయ్యాయి. ఎన్సీఎల్ కాలనీ, కాటన్ పార్కు, హెచ్టీ రోడ్, మీనాక్షి ఎస్టేట్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, గ్రీన్పార్కు కాలనీ, గోదావరి హోమ్స్, సుభాష్నగర్, శివారెడ్డి నగర్, జయరాంనగర్, అయోధ్యనగర్, గణేష్నగర్ ప్రజలకు వరద నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభి వాణీదేవి, జలమండలి ఎండీ దానకిషోర్, ఈఎన్సీ జియావుద్దీన్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అదనపు కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.