భారతదేశ ఈవీ హబ్గా ఎదిగిన హైదరాబాద్ ఫార్ములా- ఈ రేస్ నిర్వహించడానికి సరైన ప్రాంతం. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. ‘ఫార్ములా -ఈ’ని మేము 24 కార్లు పోటీ పడే రేస్గా మాత్రమే చూడటం లేదు.. భారత్లోనే అత్యంత ఎలక్ట్రిఫైడ్ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలనే లక్ష్యాన్ని చేరుకొనేందుకు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటాం. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 17 : ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఫార్ములా-ఈ (ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ చాంపియన్షిప్).. ఈ ఏడాది చివరలో జరిగే రేసింగ్కు హైదరాబాద్ను క్యాండిడేట్ హోస్ట్ సిటీగా ఎంపిక చేసుకొన్నది. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం ఫార్ములా-ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్వోఐ) పత్రాలు మార్చుకొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బ్యాటరీల తయారీకి తెలంగాణ ప్రపంచ గమ్యస్థానంగా మారాలని కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల విప్లవానికి ముందుండి నాయకత్వం వహిస్తామన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్, స్టోరేజ్ పాలసీకి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. భావితరాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
ఫార్ములా- ఈ రేస్ను హైదరాబాద్కు తీసుకొచ్చిన బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీపడి హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్కు వేదికగా ఎంపికైందన్నారు. దేశంలో ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు అధికారికంగా క్యాండిడేట్ హోస్ట్ సిటీగా ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ అని చెప్పారు. కొవిడ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్లో అద్భుతమైన రేస్ జరుగుతుందని చెప్పారు. కొన్నేండ్ల క్రితం 3డీ మంత్ర అంటే డిఫైన్, డిజైన్, డెలివర్గా ఉండేదని, ఇప్పుడు న్యూ త్రీడీ మంత్ర డిజిటైజ్, డీకార్బనైజ్, డీ సెంట్రలైజ్గా మారిపోయిందని తెలిపారు. ప్రపంచం మొత్తం ఈ విషయాల చుట్టూనే తిరుగుతున్నదని చెప్పారు. కరోనా మహమ్మారి తరువాత ప్రపంచ దేశాలన్నీ తమ ఇండస్ట్రియలైజేషన్ ప్రణాళికలను పునః పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు.
సోలార్ ఎనర్జీలో దూసుకుపోతున్నాం
కర్బన ఉద్గారాలతోపాటు పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కేవలం ఏడున్నరేండ్లలో రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి చేయడంలో రాష్ట్రం విజయవంతమైందని పేర్కొన్నారు. రాష్ట్రం వాడుకొంటున్న విద్యుత్తులో 20% సోలార్ (గ్రీన్ ఎనర్జీ) ఉన్నదన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలవడం సీఎం కేసీఆర్ సమర్థమైన నాయకత్వానికి నిదర్శనమని పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారం కార్యక్రమం ద్వారా ఏడున్నరేండ్లలో రెండు బిలియన్ల మొక్కలు నాటామని వెల్లడించారు. వాటిలో 85% బతికాయని, దీంతో గడిచిన రెండేండ్లలో రాష్ట్రంలో గ్రీన్కవర్ 632 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. ఫార్ములా-ఈకి హైదరాబాద్ హోస్ట్సిటీగా ఎంపికవడానికి ఇదొక సహజమైన కారణమని తెలిపారు. గడిచిన పదేండ్లలో హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో గ్రీన్ కవర్ 147% పెరిగిందన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను దాటుకొని హైదరాబాద్ నంబర్వన్గా నిలిచిందన్నారు.
హైదరాబాద్ సరైన చోటు
భారతదేశ ఈవీ హబ్గా ఎదిగిన హైదరాబాద్ ఫార్ములా- ఈ రేస్ నిర్వహించడానికి సరైన ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని తెలిపారు. మర్సెర్స్ ‘సిటీస్ ఆఫ్ లివిబిలిటీ ఇండెక్స్’లో గత ఐదేండ్లుగా ‘బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ’గా నిలుస్తున్నదని గుర్తుచేశారు. ‘ఫార్ములా -ఈ’ని తాము 24 కార్లు పోటీ పడే రేస్గా మాత్రమే చూడటం లేదని, భారత్లోనే అత్యంత ఎలక్ట్రిఫైడ్ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలనే లక్ష్యాన్ని చేరుకొనేందుకు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటామని వివరించారు. ఎఫ్ఐఏ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫార్ములా-ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అని ప్రశంసించారు. పదేండ్ల క్రితం ఫార్ములా -1 రేస్లో సగం వ్యూయర్ షిప్ మాత్రమే కలిగి ఉన్న ఫార్ములా-ఈ వ్యూయర్షిప్ గతేడాది ఫార్ములా-1కి సమానస్థాయికి చేరుకొన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో నిలిపేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పారిస్, రోమ్, లండన్, హంగ్కాంగ్, న్యూయార్క్, బెర్లిన్, మొనాకో లాంటి 18 నగరాల్లో జరిగే ఈ రేస్లో హైదరాబాద్ భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉన్నదని చెప్పారు. రేస్ జరగడానికి ముందు మూడు రోజులపాటు రాష్ట్రంలో ఈవీ సమ్మిట్ నిర్వహించి.. ఈవీల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి లీడింగ్ ఈవీ కంపెనీలు, ఈవీ బ్యాటరీ చార్జింగ్ కంపెనీలను ఆహ్వానిస్తామని సూచించారు. హైదరాబాద్ నిజమైన కాస్మొపాలిటన్ సిటీ అని, ఇక్కడ వివిధ మతాలు, వర్గాలు, దేశాలకు చెందిన ప్రజలు ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. రిచ్ హెరిటేజ్, కల్చర్తోపాటు ఐటీ, ఈవీ లాంటి మోడ్రన్ ఇండస్ట్రీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉండాలనేదే తమ అభిమతమని చెప్పారు.
త్వరలో నాలుగు ఈవీ బస్సు కంపెనీలు, మూడు సెల్ తయారీ సంస్థలు
ప్రతి సంవత్సరం ఫార్ములా-ఈ రేస్ను హైదరాబాద్లో నిర్వహిస్తే నగర ప్రతిష్ఠతో పాటు, ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే స్థానికంగా కొత్త వ్యాపార అవకాశాలను ఇది సృష్టిస్తుందన్నారు. ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుతో పాటు కొత్త పారిశ్రామిక విధానాలు, కొత్త డిజిటల్ విధానాలు, డీకార్బనైజ్డ్ విధానాల రూపకల్పన దిశగా పరుగెత్తే స్ఫూర్తిని కలిగిస్తుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు సీతారాంపూర్, దివిటిపల్లిలో ఈవీ క్లస్టర్లకు స్థలం కేటాయించామన్నారు. అతి త్వరలో నాలుగు ఈవీ బస్సు తయారీ, మూడు సెల్ తయారీ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
‘ఫార్ములా-ఈ’కోసం 2.37 కిలోమీటర్ల అద్భుతమైన ట్రాక్..
ఫార్ములా-వన్ రేసింగ్కు సరికొత్త ప్రత్యామ్నాయం ఫార్ములా-ఈ అని ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్, టీ-వర్క్ సీఈవో సుజయ్ కారంపూరి అన్నారు. ఫార్ములా-ఈ టీమ్తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం సరికొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పారు. హైదరాబాద్లో రేస్ నిర్వహించేందుకు అద్భుతమైన ట్రాక్ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సెక్రటేరియట్, తెలుగుతల్లి ైప్లెఓవర్ చుట్టూరా.. 2.37 కిలోమీటర్లు ట్రాక్ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ఫార్ములా- ఈ ట్రాక్ అండ్ ఓవర్లే డైరెక్టర్ అగస్ జోమినో, గ్రీన్కో గ్రూప్ సీఈవో అనిల్ చలమశెట్టి, మహింద్రా రేసింగ్ సీఈవో, టీమ్ ప్రిన్సిపల్ దిల్బాగ్గిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మా కలను సాకారం చేసిన కేటీఆర్
ఆనంద్ మహింద్ర ట్వీట్
హైదరాబాద్లో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోఐ మార్చుకున్న సందర్భంగా మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర ట్విట్టర్లో స్పందించారు. ‘మేం ఫార్ములా-ఈ వ్యవస్థాపక టీమ్లో ఒకరిగా ఉన్నాం. హోం గ్రౌండ్లో మా కార్లను రేస్ చేసి, ప్రేక్షకులను ఉత్సాహపరచాలనేది మహింద్రా రేసింగ్ చిరకాల స్వప్నం. ఆ కలను సాకారం చేసే దిశగా అడుగు వేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు. మేం ఇక ఎదురుచూడలేం..’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ థ్యాంకూ ఆనంద్జీ.. మహింద్ర రేసింగ్ను ప్రజలు ఉత్సాహపరిచేందుకు రేసింగ్ ట్రాక్ దగ్గర ఒక పోడియం ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నా. హైదరాబాద్ను బలమైన ఈవీ హబ్గా మార్చడంలో మీ మార్గదర్శకత్వం, మద్దతు అవసరం’ అని ట్వీట్ చేశారు. అద్భుతమైన ఆలోచన కేటీఆర్.. అంటూ టెక్ మహింద్ర చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జగ్దీశ్ మిత్ర సైతం ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. హైదరాబాద్కు ఫార్ములా-ఈ రేసింగ్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కేటీఆర్ను అభినందిస్తూ వేలమంది నెటిజన్లు ట్వీట్లు చేశారు.