హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో చీకట్లలో మగ్గిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక విద్యుత్తుపై ప్రజల్లో భరోసా కలిగింది. స్వరాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా 24 గంటలూ విద్యుత్తును అందించడం ప్రారంభించడంతో ఇక తెలంగాణ ఏ దశలోనూ వెనక్కి చూడలేదు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్తు వినియోగంతోపాటు వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి కూడా 24 గంటలూ ఉచిత విద్యుత్తును అందిస్తూ చరిత్ర పుటల్లోకి ఎక్కినట్టు రాష్ట్ర అర్థ గణాంకాలశాఖ శనివారం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్-2021’లో స్పష్టం చేసింది. 2014-15 నాటికి తెలంగాలో 39,519 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు వినియోగం 2020-21 నాటికి 17,488 మిలియన్ యూనిట్లు (44.25%) పెరిగి 57,007 మిలియన్ యూనిట్లకు చేరినట్టు వెల్లడించింది. వాస్తవానికి 2019-20లో రాష్ట్రంలో అత్యధికంగా 58,515 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. ఆ తర్వాత కరోనా కారణంగా పరిశ్రమలను కొంత కాలం మూసేయాల్సి రావడంతో 2020లో విద్యుత్తు వినియోగం స్వల్పంగా తగ్గింది. రంగాలవారీగా చూసుకొంటే.. 2020-21లో వ్యవసాయానికి 20,258 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని, ఇది రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు వినియోగంలో 35.5 శాతమని నివేదిక పేర్కొన్నది.