శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం పాటు పడుతున్నది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పని చేస్తూ, ప్రజలకు భద్రత కల్పిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు పరిశోధనలోనూ ముందుంది. నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపిన యంత్రాంగం, ప్రజలకు చేరువైంది. సిద్దిపేట సీపీ శ్వేత, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని నేర వార్షిక నివేదిక విడుదల చేశారు. మెదక్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 1078 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, పోలీస్ ఈ పెట్టి ద్వారా 7003 కేసులు నమోదు చేశారు. లోక్ అదాలత్లో 1221 కేసులు పరిష్కరించారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గగా, గంజాయిపై ఉక్కుపాదం మోపారు. సిద్దిపేట జిల్లాలో 6047 కేసులు నమోదయ్యాయి.
మెదక్ జిల్లాలో కమ్యూనిటీ పోలింగ్ ద్వారా 1078 సీసీ కెమెరాలు
మెదక్, డిసెంబర్ 31: నేర రహిత సమాజ నిర్మాణంలో భాగంగా నేర నియంత్రణలో విజయవంతమయ్యామని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. గురువారం వార్షిక నివేదికను ప్రకటించారు. 2020 కన్నా 2021లో నేరాల సంఖ్య పాక్షికంగా పెరిగినప్పటికీ వాటిని సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగ పర్చుకొని నేర పరిశోధనలో విజయవంతమయ్యామన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులు పలు రకాల కేసులున్నాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా వివిధ శాఖల వారి సహకారంతో కరోనాకు సంబంధించి, ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ప్రజలతో మమేకమై విధులు నిర్వహించామని తెలిపారు.
మెదక్ జిల్లాలో 2021లో..
మెదక్ జిల్లాలో 2021లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 1078 సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ ద్వారా 1948 సీసీ కెమెరాలు, ఇతరుల ద్వారా 128 సీసీ కెమెరాలు మెదక్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. లోక్ అదాల త్ ద్వారా 1221 కేసులు పరిష్కరించబడ్డాయని, జిల్లాలో ఈ-పెట్టి కేసులు 7003 కే సులు నమోదయ్యాయని, జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపా నం సేవించిన కేసులు 3471 నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో 98, ఆపరేషన్ స్మైల్ ద్వారా 77 మొత్తం 175 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాన్నారు. నేరాలు, వాటి అనర్ధాల వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి రెండు సార్లు మెగా మెడికల్ క్యాంపు ద్వారా అన్ని రకాల పరీక్షలు చేయించామని తెలిపారు.
మెదక్ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు..
మెదక్ జిల్లాలో మొత్తం నమోదైన కేసుల వివరాలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. 2020లో 3744 కాగా, 2021లో 3892 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన కేసులు 2020లో 89 కాగా, 2021లో 103 కేసులు, సాధారణ కేసులు 2020లో 3655 కాగా, 2021లో 3789 కేసులు, 2021లో 25 కేసులు, ఆస్తి కోసం హత్యలు 2020లో 1, 2021లో 6 కేసులు నమోదయ్యాయి. అపహరణలు 2020లో 17 కేసులు, 2021లో 29 కేసులు, అత్యాచారాలు 2020లో 39, 2021లో 46 కేసులు, దోపిడీలు 2020లో 2, 2021లో 2 కేసులు నమోదు కాగా, పగటి దొంగతనాలు 2020లో 13, 2021లో 11 కేసులు, రాత్రి దొంగతనాలు 2020లో 71, 2021లో 99 కేసులు నమోదు, సాధారణ దొంగతనాలు 2020లో 136, 2021లో 167, గొలుసు దొంగతనాలు 2020లో 6, 2021లో 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొంగతనాల్లో 2020లో కోల్పోయిన ఆస్తులు 3,71,48,261 కాగా, 2021లో 1,03,73,554ల విలువ చేసినవి ఉన్నాయి. అదేవిధంగా ఆస్తి రికవరీ 2,61,68,998 ఉండగా, 2021లో 30,12,050 రికవరీ చేశారు. 2020లో 70.44 రికవరీ శాతం ఉండగా, 2021లో 29.04 శాతం ఉన్నదని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తాం..
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గత సంవత్సరం కంటే నేరాల సంఖ్య పెరిగినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో విజయం సాధించాం. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రజల తమ సమస్యలు నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో 7003 ఈ పెట్టి కేసులు నమోదు చేశాం.లోక్ అదాలత్లో 1221 కేసులు పరిష్కారమయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో 2021లో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..
సంగారెడ్డి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాడి 2021లో నేరాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాతో పోల్చి చూస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. గత ఏడాది (2020) సంగారెడ్డి జిల్లాలో 750 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 2021లో 719 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య సైతం తగ్గింది. 2020లో రోడ్డు ప్రమాదాల్లో 779 మంది క్షతగాత్రులు కాగా 2021లో 644 మందికి గాయాలయ్యాయి. 2020లో రోడ్డు ప్రమాదాల్లో 387 మంది మృతి చెందగా, 2021లో రోడ్డు ప్రమాదాల్లో 419 మంది మృతి చెందారు. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకోలేదు. కాగా ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. దీంతో నేరాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2020 లోచోరీలు 340 చోటు చేసుకోగా, 2021 లో 345 చోరీలు జరిగాయి. ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో 2021లో గంజాయి కేసులు ఎక్కువగా నమోదు కావటంతోపాటు పెద్ద మొత్తంలో పోలీసులు ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
2020లో 23 గంజాయి కేసులు నమోదు చేయగా, 1112 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2021లో పోలీసులు 46 గంజాయి కేసులు నమోదు చేశారు. 46 కేసులకు సంబంధించి 2600 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈవ్టీజింగ్ కేసులు 2020లో 11 నమోదు కాగా, 2021లో తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. షీటీమ్ కేసులు 2020లో మూడు నమోదు కాగా, 2021లో కేవలం ఒక్క కేసు నమోదైంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించటం, కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారికి 2021 లో చలానాలు విధించారు. 2020లో ఈ-చలానాలు 1,28,670 నమోదు చేసి రూ.11.48 కోట్ల చలానా డబ్బులు వసూలు చేశారు. 2021లో 2,43,224 ఈ చలానాలు నమోదు కాగా, రూ.17.63 కోట్ల చలానా డబ్బులు వసూలు చేయటం జరిగింది.
సురక్షిత కమిషనరేట్ లక్ష్యంగా..
సిద్దిపేట టౌన్, డిసెంబర్ 31: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం పాటుపడుతున్నారు. అనుక్షణం విధులు నిర్వర్తిస్తూ సురక్షిత కమిషనరేట్ లక్ష్యంగా పని చేస్తున్నారు. ఫలితంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది గతంలో కంటే నేరాలు తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 11శాతం నేరాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్వేత వార్షిక నివేదికను గురువారం విడుదల చేశారు. సిద్దిపేట కమిషనరేట్లో వరుసగా రెండు సంవత్సరాలుగా నేరాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పోలీసులు అమలు చేస్తున్న సంస్కరణలు సఫలం అవుతున్నాయి. గత ఏడాది 6656 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 6047 కేసులు నమోదయ్యాయి.
దొంగతనాలు 659 నమోదు అయ్యాయి. చోరీ కేసులు గతంలో కంటే స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది 21 హత్యలు జరుగగా, ఈ ఏడాది 15 ను జరిగాయి. అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సొత్తు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో కంటే ఈ ఏడాది తగ్గాయి. గత ఏడాది 341 మంది చనిపోగా ఈ ఏడాది 281 మంది చనిపోయారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వాహనదారులకు 34.27 కోట్ల జరిమానాను విధించారు. ఇసుక అక్రమ రవాణా కేసులు 165 నమోదు చేశారు. కల్తీ విత్తనాల కేసులు 12, బెల్టు షాపుల నిర్వాహకులపై 43 కేసులు నమోదు చేశారు. డయల్ యువర్ పోలీస్ 100కి వచ్చిన కాల్స్ని స్వీకరించి ఎక్కువ శాతం సమస్యలను పరిష్కరించారు. ముగ్గురిపైన పీడీ యాక్ట్ కేసులను నమోదు చేశారు. మహిళలపై గత ఏడాది 684 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 660 కేసులు నమోదయ్యాయి.
ప్రధాన భూమిక పోషించిన సీసీ కెమెరాలు
నేరాల నియంత్రణకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో దాతల సహకారం, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో సీసీ కెమెరాలను బిగించారు. ఎక్కడ నేరం జరిగినా వెంటనే పసి గట్టేలా వారిని వెన్నెంటి పట్టుకునేలా సీసీ కెమెరాలు బిగించారు. సిద్దిపేట కమిషనరేట్లో 43 శాతం సీసీ కెమెరాల ఆధారంగానే కేసులను చేధించారు.
పెరిగిన సైబర్ నేరాలు ..
బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం ఓటీపీ నంబర్, ఆధార్ నంబర్ చెప్పండి అంటూ మోసం చేసే సైబర్ కేటుగాల్లు ఈ ఏడాది పెరిగారు. గత ఏడాది ఇదే సమయానికి కమిషనరేట్లో నమోదు కాగా, ఈ ఏడాది 43 కేసులు నమోదయ్యాయి. అందులో దాదాపు కేసులను పోలీసులు చేధించారు. సైబర్ నేరస్తుల భారీన పడకుండా కళాజాత కళాకారుల చేత చైతన్య పరిచారు. పోలీసులు మానవత్వాన్ని చాటి ఎంతో మందికి అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ఆపద్బాదవులుగా మారారు. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ ఏడాదిలో కొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మొత్తం మీద పోలీస్ కమిషనరేట్లో నేరాల నియంత్రించడంలో సఫలమైంది.