హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రూపొందించిన ప్రొటోకాల్ మొత్తం ఆంధ్రప్రదేశ్కు వత్తాసుపలికేలా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం విమర్శించింది. ట్రిబ్యునల్, ప్లానింగ్ కమిషన్ అనుమతులకు విరుద్ధంగా ప్రాజెక్టుల నిర్వహణ నిబంధనలు రూపొందించారని మండిపడింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం లేఖ రాశారు. రివర్ బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రప్రభుత్వం విడుదలచేసిన గెజిట్ అమలుకు సంబంధించిన అంశాల పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
కేఆర్ఎంబీ రూపొందించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రొటోకాల్ను ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ జలవిద్యుత్తు ప్రాజెక్టు మాత్రమేనని లేఖలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా క్యాచ్మెంట్ ఏరియా లేదని, శ్రీశైలం నుంచి జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా మాత్రమే నీరు అందుతుందని గుర్తుచేసింది. ఈ అంశాలను పట్టించుకోకుండా ప్రొటోకాల్ రూపొందించారని తప్పుపట్టింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 34 టీఎంసీల నీటిని మాత్రమే తరలించేందుకు ఏపీకి అవకాశన్నప్పటికీ, కేవలం ఏడేండ్ల కాలంలో నీటి వినియోగం ఆధారంగా ప్రొటోకాల్ను రూపొందించిందని విమర్శించింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఒకదానిపై ఒకటి ఆధారపడినవని, ఈ రెండింటికి సంబంధించిన సమగ్ర ప్రొటోకాల్ను ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా రూపొందించాలని సూచించారు. వరద ఆధారిత ప్రాజెక్టులకు సైతం ఎప్పుడు నీటిని మళ్లించాలనే అంశంపై కచ్చితమైన ప్రొటోకాల్ను తయారుచేయాలని కోరింది. రజత్కుమార్ తన లేఖతోపాటు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, ప్లానింగ్ కమిషన్ అనుమతులకు సంబంధించిన పత్రాలను జతచేశారు.