హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దుబాయ్ ఎక్స్పో2020లో తెలంగాణ మహిళల సారథ్యంలోని స్టార్టప్లు మదుపరులను ఆకట్టుకునే దిశగా వెళ్తున్నాయి. భారతీయ పెవిలియన్ ‘ఇండియా ఇన్నోవేషన్ హబ్’లో మూడు రోజులపాటు ‘తెలంగాణ వీక్’ పేరుతో రాష్ర్టానికి చెందిన స్టార్టప్ల ప్రదర్శన జరుగుతుండగా, ఇది మంగళవారం మొదలైంది. ఈ నెల 11 వరకు జరిగే ఈ ప్రదర్శన సందర్భంగా ప్రముఖ ఇండస్ట్రీ లీడర్లతో రాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార విస్తరణ, ఉత్పత్తి లక్ష్యాలు, తదితర ఆలోచనల్ని పంచుకుంటున్నారు. తద్వారా తెలంగాణలోకి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారు.
వీరిలో ఆర్కిట్యూడ్ వ్యవస్థాపక సీఈవో విజయదుర్గ కొప్పిశెట్టి, హెకోల్ ఫౌండర్ దీప్తి నాథలైస్, హీలో డిజైన్ సారథులు మౌన గుమ్మడి-సాహిత్ గుమ్మడి, రేడియస్ ఎడ్యుటెక్ ఫౌండర్స్ నాగమల్లిక వల్లూరు-సిద్ధార్థ మాలెంపాటి ఉన్నారు. ‘మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కు ఆర్థికంగా అండగా నిలుస్తూ, మార్కెట్లో మెరుగైన అవకాశాలను కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అద్భుత సృష్టి ‘WE-HUB’ విశేషంగా కృషి చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్కు విస్తరించడానికి మహిళల నాయకత్వంలోని స్టార్టప్లకు ఈ వరల్డ్ ఎక్స్పో2020 చక్కని వేదిక’ అని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కాగా, ఈ ఎక్స్పోలో భారత్ నుంచి 500 ప్రముఖ స్టార్టప్లు పాల్గొంటున్నాయి.