హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/గాజులరామారం: జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాధినేని ప్రహ్లాద్ (జంగ్ ప్రహ్లాద్) నిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రహ్లాద్ కొనసాగించిన సాంస్కృతిక కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రహ్లాద్ తన పాటలతో జంగ్ సైరన్ మోగించి, ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షించారు. కాళ్లకు గజ్జె కట్టి, పాటలు పాడి, ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమనేత కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. జగద్గిరిగుట్టలో నివసిస్తూ, అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అక్టోబర్ 27న అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆల్విన్కాలనీలో స్పీడ్ బ్రేకర్ను దాటే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం మీద నుంచి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత కూకట్పల్లిలోని ఒక ప్రైవేట్ దవాఖానకు అనంతరం నిమ్స్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆయన స్వగ్రామం హన్మపురంలో మంగళవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు సంతాపం వ్యక్తంచేశారు.