సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సర్కార్ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు వైద్య కళాశాలలు, దవాఖానల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సీనియర్ వైద్య నిపుణులను కేటాయించడంతో పాటు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ఇప్పటికే జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో కొంత మంది వైద్యాధికారులకు పదోన్నతులు, పోస్టింగ్లు సైతం కల్పించింది. ఈ క్రమంలోనే ఉస్మానియా మెడికల్ కళాశాల పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో బదిలీలు, కొత్తవారికి పోస్టింగ్లు, పదోన్నతులు కల్పించారు. ఉస్మానియా వైద్యకళాశాల పరిధిలో 16 మంది వైద్యాధికారులకు పదోన్నతులతో పాటు కొత్త పోస్టింగ్లు కూడా కల్పించగా ముగ్గురు అధికారులకు స్థానచలనం కల్పించారు.
గాంధీ వైద్య కళాశాల పరిధిలో ఏడుగురికి పదోన్నతులతో పాటు నూతన పోస్టింగ్లు ఇచ్చారు. అయితే, పదోన్నతులు కల్పించిన వైద్యాధికారులందరికీ జిల్లాల్లోని ఆయా దవాఖానల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఉస్మానియా, గాంధీ దవాఖానలో ఇన్చార్జి సూపరింటెండెంట్లుగా ఉన్న అధికారులకు పూర్తిస్థాయి పోస్టింగ్లు కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉస్మానియా, గాంధీ వైద్యకళాశాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యాధికారులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు మారనున్నారు. దీర్ఘకాలంగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు వైద్యాధికారును ఇతర దవాఖానలకు బదిలీ చేశారు.
వివాదాస్పద అంశాలతో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కొరఢా జుళిపించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా విధులు నిర్వర్తించాల్సిన సమయంలో ప్రైవేటు దవాఖానల్లో ప్రాక్టీస్కు వెళ్లడం, రోగులకు అందుబాటులో ఉండకపోవడం, సమయపాలన పాటించకుండా వచ్చి పోవడం, రోజుల తరబడి డుమ్మాలు కొడుతూ గైర్హాజరైన తేదీల్లో హాజరైనట్టు సంతకాలు పెట్టడంతో పాటు యూనియన్ల ముసుగులో డ్యూటీకి ఎగ్గొట్టేవారి చిట్టాను ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ తయారు చేసినట్లు సమాచారం. ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కొరఢా జుళిపించేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది.
ప్రొఫెసర్లు, హెచ్ఓడీలూ ఇక నుంచి తప్పనిసరిగా ఓపీ చూడాల్సిందేనని మంత్రి హరీశ్రావు మంగళవారం నిలోఫర్లో జరిగిన సమీక్షలో వైద్యులను ఆదేశించారు. శస్త్ర చికిత్సలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలని, ప్రతినేలా సమీక్ష నిర్వహించాలని సూచించారు.
గ్రేటర్ను వీడి వెళ్లేందుకు పలువురు వైద్యాధికారులు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. నగరాన్ని వదిలి వెళ్లడం కంటే పదోన్నతినే వదులుకోవడం మేలంటున్నారు కొందరు అధికారులు. కారణాలేవైనా ప్రస్తుతం పనిచేస్తున్న దవాఖానలను వదిలి వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. పదోన్నతులు వద్దంటున్న వైద్యాధికారులను ఎలాగైనా ప్రస్తుతం ఉన్న పోస్టింగ్ల నుంచి తప్పించడం మాత్రం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిరంతరం కుంభకోణాలు, వివాదాలు, రాజకీయాలకు నిలయంగా మారిన నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణను మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో నిలోఫర్ సూపరింటెండెంట్గా కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సూపరింటెండెంట్ రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి పదోన్నతి లభించడంతో ప్రస్తుతం ఇద్దరు వైద్యాధికారులు సూపరింటెండెంట్ రేసులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సైతం వివాదాలకు కేరాఫ్గా మారింది. ప్రస్తుతం ఇక్కడ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జయలతకు సూర్యపేట ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్గా పదోన్నతి లభించడంతో ఎంఎన్జే డైరెక్టర్ కుర్చీ ఖాళీ అయ్యింది. అయితే, ఈ స్థానానికి కూడా తీవ్ర పోటీ ఉండటంతో ఉన్నతాధికారులు సీనియర్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఎంఎన్జే డైరెక్టర్ రేసులో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. దవాఖానలో పనిచేసే వారినే డైరెక్టర్ పోస్టు వరిస్తుందా.. లేక నిమ్స్ తరహాలో బయటి వారికి వరిస్తుందా.. వేచి చూడాలి.