చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్కు తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో జోరు మీదున్న వరంగల్ కుర్రాడు మెగాటోర్నీలో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. చెన్నై వేదికగా జూలై 28 నుంచి జరుగనున్న 44వ ఒలింపియాడ్కు అఖిల భారత చెస్ ఫెడరేషన్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత జట్లను సోమవారం ప్రకటించింది. ఓపెన్, మహిళల విభాగంలో 20 మంది ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఈ బృందాలకు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యా వేదికగా జరుగాల్సిన ఈ మెగాటోర్నీ భారత్కు చేరిన విషయం తెలిసిందే. 14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 150 దేశాల నుంచి ప్లేయర్లు పాల్గొంటారని ఏఐసీఎఫ్ భావిస్తున్నది. ఒలింపియాడ్లో భారత్ 2014లో కాంస్యం, 2020లో స్వర్ణం, 2021లో కాంస్యం సాధించింది. గతానికన్నా ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే ఉద్దేశంతో భారత చెస్ సమాఖ్య ప్రతిభ గల యువ ప్లేయర్లతోపాటు సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్లను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతున్న భారత సీనియర్ ప్లేయర్లతో పాటు యువ జీఎమ్లు మెగాటోర్నీలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఓపెన్: ఇండియా-ఏ: విదిత్ గుజరాతి, హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి, నారాయణన్, శశికిరణ్.
ఇండియా-బీ: నిహాల్ సరిన్, గుకేశ్, అదిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వని.
మహిళలు: ఇండియా- ఏ: కోనేరు హంపి, హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి.
ఇండియా -బీ: వాంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, మేరి అన్గోమ్స్, పద్మినీ రౌత్, దివ్య దేశ్ముఖ్.