హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమం సహా అనేక రంగాల్లో దేశ నిష్పత్తి కంటే.. తెలంగాణ రాష్ట్ర నిష్పత్తి ఉన్నతంగా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా విడుదలచేసిన ‘హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్-2021’లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని వెల్లడించారు. ఆర్బీఐ నివేదికను చూసైనా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండ్లు తెరిచి, వాస్తవాలు గ్రహించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు, ప్రగల్భాలు మానుకోవాలని హితవు చెప్పారు. నిధులు, కొత్త పథకాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయహోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం గత ఏడేండ్లలో తెలంగాణ ప్రగతి అద్భుతంగా ఉన్నదని, దేశ సగటుకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎంతో మెరుగ్గా ఉన్నదని ఆయన గణాంకాలతో సహా వివరించారు.