హైదరాబాద్: కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో పాటు వైద్య ఆరోగ్య, పంచాయతీ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంస్థల పునః ప్రారంభంపై శుక్రవారం సీఎస్ సోమేశ్ సమీక్షచేశారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి వంద శాతం టీకాలు వేయాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం టీకాలు వేయించుకున్నట్లు ఆయా పాఠశాలల వద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేగాకుండా విద్యాసంస్థలను ప్రతిరోజూ శుభ్రపరచాలని సీఎస్ ఆదేశించారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంపై పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.