హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పోటెత్తిన నాగళ్లు.. పంజకట్టిన వరికంకులు.. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి బారులు కట్టిన రైతులు.. ఇందిరాపార్క్లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే. గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాధర్నాలో కేంద్రప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమర శంఖం పూరించారు. ధర్నాను అన్నీ తానే అయ్యి నడిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అన్నదాత కోసం ఉగ్రనర్సింహుడయ్యారు. అలుపెరుగని పోరాటానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. బీజేపీ పాలనలో తల్లడిల్లుతున్న దేశ రైతాంగం కోసం ఉద్యమించే సత్తా టీఆర్ఎస్కే ఉన్నదని చాటిచెప్పారు.
కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవటానికి టీఆర్ఎస్ సిద్ధమైందన్న సంకేతాన్ని ఇందిరాపార్క్ ధర్నా ద్వారా దేశానికి ఇచ్చారు. పార్టీ శ్రేణులకు కర్తవ్యబోధ.. విపక్షాలపై నిప్పుల వాన.. రైతులకు భరోసా.. ఈ మూడు అంశాల మేళవింపుగా సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆడుతున్న ద్వంద్వ నాటకాన్ని పటాపంచలు చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులకు కావాల్సిన అన్ని అస్త్రశస్ర్తాలను మహాధర్నా వేదికగా అందించారు. గ్రామ గ్రామాన బీజేపీకి చావుడప్పు కొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎమ్మెస్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.. ఇలా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను మహాధర్నాకు ఆహ్వానించారు. ఇది టీఆర్ఎస్ చేపట్టే మరో పోరాటానికి శిక్షణ వేదికగా మారింది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ అన్ని స్థాయిల టీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రైతుల కోసం గ్రామగ్రామాన పోరాటం కొనసాగించాలని, బీజేపీని బోనులో నిలబెట్టాలని కర్తవ్యబోధ చేశారు. జెండా లేపాల్సిన, ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపిం ది. పార్టీ, ప్రభుత్వం ఏకమై తమకు అండగా నిలుస్తుందనే భరోసాను సీఎం కేసీఆర్ ఇచ్చారు.
మెడలో ఆకుపచ్చ కండువాతో మూడు గంటలపాటు మహాధర్నా ప్రాంగణం అంతా తానై నడిపించారు. ధర్నా నేపథ్యం, ఆవశ్యకత, భవిష్యత్తు కార్యాచరణపై మూడుసార్లు ప్రసంగించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడించారు. వ్యయసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, రసమయి బాలకిషన్ వివిధ అంశాలపై ప్రసంగించారు. నేతల ప్రసంగానికి మధ్యలో సాయిచంద్తో పాటలు పాడించారు.
మహాధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్యమకాలాన్ని మరోసారి నెమరేసుకున్నారు. ‘మోదీ ఓ కిలాడీ, ఏందయ్య నీ గడిబిడి, దేశాన్ని అమ్ముతున్నవ్ చేసి పకోడీ, అన్నదాత ఉసురుతగిలి పోతవు నువు.. పురుగులబడీ’ అని సాయిచంద్ పాట అందుకోగానే చప్పట్లతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. వరి‘గొలుసు’ధారణ, భుజాన నాగలితో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం కేసీఆర్కు వరి గొలుసులతో చేసిన బుట్ట, నాగలిని సండ్ర బహూకరించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మహాధర్నాలో మంత్రులతో పాటు వేదిక మీద కాకుండా జనం మధ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కేటాయించిన స్థలంలో నేల మీదే కూర్చున్నారు. వేదిక మీదినుంచి నినాదాలు చేసిన ప్రతిసారీ పిడికిలెత్తి ప్రతిగా నినదించారు. చప్పట్లు కొడుతూ కళాకారులు, కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. మహాధర్నా కోసం అసాధారణ ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీశ్రావు ధర్నా ప్రారంభానికి 2 గంటల ముందే అక్కడికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇందిరాపార్క్ వద్దకు ఉదయం 11 గంటలకే భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రైతులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సరిగ్గా 11 గంటలకు వేదిక ప్రాంగణానికి వచ్చారు. ధర్నా ఆవశ్యకతను తొలి ప్రసంగంలో వివరించారు. ఆ తరువాత ఎనిమిది మంది మంత్రులు, నాయకులు వివిధ అంశాలపై ప్రసంగించారు. చివరగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు.. రాష్ట్ర రైతాంగానికి తానున్నానంటూ భరోసా కల్పించారు. కేంద్రం మెడలు వంచేలా అలుపెరుగని పోరాటం చేస్తామని, అవసరమైతే ఢిల్లీ యాత్ర చేపడతామని ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు మహాధర్నాను ముగించి సీఎం వెళ్లిపోగా, మంత్రులు, నేతల బృందం గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభు త్వం. అందుకే ప్రజల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నది. ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా మహాధర్నాలో పాల్గొన్నారు. ఇది ఆయనకు రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శ నం. దేశంలో పండిన ధాన్యాన్ని సేకరించి అవసరమైన ప్రాంతాల్లో పంపిణీ చేయడం కేంద్రం బాధ్యత. ఆహార భద్రత చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ధాన్యాన్ని సేకరించాల్సిన అవసరం ఉన్నది.
-కే కేశవరారావు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్
రాష్ట్రంలో ప్రభుత్వం 5 వేల కొనుగోలు కేంద్రాలు తెరిచి ఇప్పటికే పది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, బీజేపీ నేతలు ధాన్యం కొనాలని డిమాండ్చేయటం విడ్డూరంగా ఉన్నది. కేంద్రం వ్యవసాయ వ్యతిరేక విధానాలతో ఉత్తరాది రైతాంగం ఉడికిపోతున్నది. ఇప్పుడు దక్షిణాదిన మంటపెట్టి రైతుల సహనానికి పరీక్ష పెట్టొద్దు. ధాన్యం కొంటారో లేదో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం ఇవ్వకుండా చేతులెత్తేయడం అన్యాయం.
రాష్ట్రంలో వరి సాగు 60 లక్షల ఎకరాలు దాటిందని ఒప్పుకొనేందుకు ప్రతిపక్ష నేతలకు సిగ్గవుతున్నది. క్షుద్ర రాజకీయాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను చూపిస్తారా? ధాన్యం కొనుగోలు సమస్య కేంద్ర, రాష్ర్టాల తగవు కాదు. రైతుల భవిష్యత్తుకు సంబంధించినది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. -జగదీశ్రెడ్డి, మంత్రి
రైతుల కోసం ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా కేసీఆర్ మహాధర్నా చేపట్టారు. వేలమం ది పాల్గొని రైతాంగానికి అండగా నిలిచా రు. ధాన్యం కొనుగోలుపై నెలరోజులుగా కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు. స్వాతంత్య్రోద్యమంలో గాం ధీ పాత్ర ఎక్కడని అడిగినట్టు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటని అడుగుతున్నారు. -పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
బీజేపీ నేతలు బద్మాష్ మాటలు మానాలి. ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ మూడు డిమాండ్లు చేశారు. కేంద్రం వాటికి సమాధానం చెప్పాలి. దేశభద్రత, ఆహార భద్రత కేంద్రం పరిధిలో ఉండాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. దీని ప్రకారమే పుడ్ అండ్ సివిల్ సైప్లెశాఖ ఏర్పడింది. ఎక్కడ ఎక్కువ ధాన్యం పండితే అక్కడ సేకరించి పండని ప్రాంతాలకు సరఫరా చేయాలి. రైతులకు న్యాయం జరగాలంటే, రైతు రాజు కావాలంటే కేసీఆర్ బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది. -కడియం శ్రీహరి, మాజీ డిఫ్యూటీ సీఎం
రైతులకు భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. దేశంలో ఎవరూ చేయని రీతిలో వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని చూసి ఓర్వలేనివారు కొత్త చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యూపీలో ధర్నా చేస్తున్న రైతులను కారుతో తొక్కించి చంపారు. -గొంగిడి సునీత, ప్రభుత్వ విప్
తెలంగాణలో మూడు పంటలకు నీళ్లు ఇస్తుంటే కేంద్రం కండ్లు మండుతున్నయ్. కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు చూ స్తుంటే రక్తం సలసల మరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కావాలని అడిగితే బషీర్బాగ్లో నాటి ప్రభుత్వం రైతులను కాల్చిచంపింది. నేడు ధాన్యం కొనకుండా కేంద్రం రైతుల ఉసురు తీస్తున్నది. -రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే
రైతుల ఉనికి, అస్తిత్వాన్ని దెబ్బ తీసేలా కేంద్రం కుట్ర చేస్తున్నది. భూమినే నమ్ముకున్నవారికి భరోసాను ఇవ్వాల్సింది పో యి పంట సేకరణకు ముందుకు రావట్లేదు. ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరి నా ఫలితం లేకపోవడంతోనే రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం మహాధర్నా చేపట్టింది. -సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే