టీ20 ప్రపంచకప్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకముందే టీమ్ఇండియా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది! తొలి రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాలు చవిచూసిన కోహ్లీ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గి పోటీలోకి వచ్చినట్లు కనిపించినా.. ఆదివారం అఫ్గానిస్థాన్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ నాకౌట్ దారులు మూసుకుపోయాయి. మెగాటోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైన టీమ్ఇండియా.. ఆదివారం అఫ్గాన్ అద్భుతం చేస్తుందేమో అని ఆశగా ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. గ్రూప్-2లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన పాకిస్థాన్ 10 పాయింట్లతో టాప్లో నిలువగా.. 8 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంతో సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నాకౌట్ చేరిన విషయం తెలిసిందే. బుధవారం జరుగనున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్, గురువారం జరుగనున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిన టీమ్ఇండియా.. ఈ సారి లీగ్ దశలో జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఓడి నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
అద్భుతం జరుగాలని.. అఫ్గాన్ గెలువాలని ఆశించిన అభిమానులకు.. ప్రార్థించిన వీరాభిమానులకు నిరాశే మిగిలింది!
కాబూలీలపై విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్తే.. టీ20 ప్రపంచకప్లో మరో మ్యాచ్ మిగిలుండగానే టీమ్ఇండియా పోరాటం ముగించింది. చివరి లీగ్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా సెమీస్ జట్లు ఖరారైపోవడంతో.. నేడు భారత్, నమీబియా మధ్య జరుగనున్న పోరు నామమాత్రంగా మారింది!
స్వయంకృతమే..
మెగాటోర్నీకి ముందు ఇదే పిచ్లపై ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న భారత ఆటగాళ్లు అదరగొడతారని అభిమానులు ఆశిస్తే.. పాకిస్థాన్తో తొలి మ్యాచ్లోనే మనవాళ్లు తేలిపోయారు. అప్పటి వరకు తలో జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. కలిసికట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. పాక్తో పోరులో కనీస ప్రభావం చూపలేకపోయిన కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై అధఃపాతాళానికి పడిపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా.. ఆరంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దశలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఫర్వాలేదనిపించారు. ఫలితంగా పోరాడే స్కోరు చేయగలిగిన భారత్.. బౌలింగ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ను మన బౌలర్లు అడ్డుకుంటారనుకుంటే.. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు. అత్యుత్తమ బౌలర్కు బంతినివ్వకుండా టచ్లో లేని భువనేశ్వర్ కుమార్తో బౌలింగ్ దాడి ప్రారంభించడమే భారత్ను డైలమాలో పడేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఏమాత్రం కసి కనబర్చలేకపోయిన భారత్.. వన్డే, టీ20 ప్రపంచకప్లలో తొలిసారి పాకిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసింది. బాబర్ ఆజమ్ మినహా పెరున్న ఆటగాళ్లెవరూ లేని పాక్ జట్టు.. టీమ్ఇండియాపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో చెలరేగి పోయిన దాయాది జట్టు.. టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే సెమీస్కు చేరుకుంది.
వ్యూహాత్మక తప్పిదాలతో..
ఒక్క మ్యాచే కదా పోయేదేముంది.. ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి భారత జట్టు నాకౌట్ చేరడం పెద్ద కష్టం కాదనుకుంటున్న సమయంలో వారం రోజుల విరామం తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్లో బరిలోకి దిగిన టీమ్ఇండియా మళ్లీ పాత కథనే పునరావృత్తం చేసింది. మరోసారి టాస్ కలిసిరాకపోవడంతో మొదట బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన.. ఘోరంగా విఫలమైంది. వ్యూహాత్మక తప్పిదాలతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసిన టీమ్ మేనేజ్మెంట్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా దింపిన ఇషాన్ కిషన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోగా.. వన్డౌన్లో వచ్చిన రోహిత్, రాహుల్, కోహ్లీ, పంత్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరిపోయారు. జట్టు స్కోరు మూడంకెలు చేరడమే గగనమైన చోట.. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని మరో 33 బంతులు మిగిలుండగానే ఛేదించారు. ఏస్ పేసర్ బుమ్రా ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. ఈ రెండు పరాజయాలతోనే భారత్ భవితవ్యం దాదాపు తేలిపోగా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్పై విజయాలు సాధించి కాస్త ఆశలు రేపింది. అఫ్గాన్పై న్యూజిలాండ్ విజయంతో అవి కాస్త గల్లంతయ్యాయి. చివరి లీగ్ మ్యాచ్ ఫలితంతో సబంధం లేకుండానే సెమీస్ చేరే జట్లేవో స్పష్టమైపోవడంతో.. ఇక వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పావులు కదపడమే మేలు!
జవాబేది?
పొట్టి ఫార్మాట్లో జరిగిన తొలి ప్రపంచకప్ (2007)లోనే అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురు చూపులు కొనసాగిస్తున్నది. ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలనే ఉద్దేశంతో టీమ్ మేనేజ్మెంట్.. మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోనీని మెంటార్గా నియమించింది. అయినా పెద్దగా ప్రభావం కనబడకపోవడమే ఇప్పుడు సగటు క్రీడాభిమానిని కలచి వేస్తున్నది. ‘సలహాలు, సూచనలు ఇవ్వడమే మెంటార్ పని.. మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే’ అన్న సునీల్ గవాస్కర్ మాటలు మరోసారి అక్షర సత్యాలని తేలినా.. కివీస్తో పోరులో రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి దింపడం! బౌలింగ్ చేయలేకపోతున్నా.. ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యాను జట్టులో కొనసాగించడం! అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశమివ్వకపోవడం వంటి ప్రశ్నలకు బదులు చెప్పేదెవరో?
పాపం కోహ్లీ..!
అత్యుత్తమ ఆటగాళ్లు విజయవంతమైన సారథులు కావాలని రూలేం లేదన్నట్లే.. ప్రపంచ ఉత్తమ ఆటగాడిగా మన్ననలందుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడనే చెప్పాలి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి 2019 వన్డే ప్రపంచకప్లో టీమ్ను ముందుకు నడిపించిన విరాట్.. సెమీఫైనల్తోనే సరిపెట్టకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ పరాజయం వైపు నిలిచాడు. ఇక ఇప్పుడు పొట్టి ప్రపంచకప్లో కనీసం నాకౌట్కు అర్హత సాధించలేక లీగ్ దశలోనే పోరాటం ముగించాడు. బ్యాటర్గా టన్నుల కొద్ది పరుగుల, వందల కొద్ది రికార్డులు బద్దలు కొట్టిన ‘కింగ్’.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. మెగాటోర్నీకి ముందే టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతానని చెప్పిన విరాట్.. ఇకపై వన్డేల్లోనూ ఆటగాడిగానే జట్టులో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే కోహ్లీని కెప్టెన్గా పరిమితం చేయాలనే వాదనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో అతడు వన్డే సారథ్యాన్ని కూడా వదిలేసుకోవాల్సి రావొచ్చు. రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్గా పెద్దగా సఫలం కాలేకపోయినా.. సరైన సమయంలో సారథ్యాన్ని వీడిన మాస్టర్ కెరీర్లో మరెన్నో మైలురాళ్లు అందుకున్నాడు. అతడి బాటలోనే నడుస్తూ కోహ్లీ కూడా ఆటగాడిగా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం!