నిజామాబాద్లో అనుమతి లేకుండా విధులకు డుమ్మా
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 22: ఓ ఉపాధ్యాయురాలు 15 ఏండ్లుగా విధులకు రావడం లేదు. అధికారుల అనుమతి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా డ్యూటీకి డుమ్మా కొడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ వై స్వప్న 2006 ఫిబ్రవరి 7 నుంచి విధులకు రావడం లేదు. 2005 నుంచి పాఠశాలకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సదరు టీచరు పత్తాలేకుండా పోయిన విషయాన్ని గత జూలైలో జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. నోటీస్ జారీ చేసినా ఆ ఉపాధ్యాయురాలి నుంచి స్పందన లేదు. తాజాగా శుక్రవారం డీఈవో దుర్గాప్రసాద్ ఆమెకు ఫైనల్ నోటీస్ పంపారు. ఈ నోటీస్కూ స్పందించని పక్షంలో కలెక్టర్ అనుమతితో విధుల నుంచి డిస్మిస్ చేస్తామని డీఈవో తెలిపారు.