న్యూఢిల్లీ, డిసెంబర్ 6:దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..కమర్షియల్ వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కమోడిటీ, ముడి సరుకుల ధరలు పెరుగడం వల్లనే జనవరి 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో మీడియం అండ్ హెవీ కమర్షియల్ వాహనాలు, ఇంటర్మిడియట్ అండ్ లైట్ కమర్షియల్ వాహనాలు, చిన్న కమర్షియల్ వాహనాలు, బస్సుల మరింత ప్రియంకాబోతున్నాయి. కమోడిటీ ఉత్పత్తులైన స్టీల్, అల్యుమినియం, ఇతర ముడి పదార్థాలు ఇటీవల కాలంలో భారీగా పెరుగడంతో సంస్థపై పడుతున్న భారాన్ని కొద్దిలో కొద్దిగా తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మారుతి, మెర్సిడెజ్ బెంజ్, ఆడీలు తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.