సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ ముఠాలను పట్టుకోవడంలో టాస్క్ఫోర్స్ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని సీపీ ఆనంద్ సిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక కేసుల దర్యాప్తులో నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని చెప్పారు. డ్రగ్స్ సరఫరాలో ఆరితేరిన ముంబైలో ఉంటున్న నైజీరియాకు చెందిన టోనీని పట్టుకుంటామన్నారు. ఈ ముఠాలు ఓయో హోటల్స్ను అడ్డగా చేసుకుంటున్నాయని, హోటల్లో ఎవరు దిగినా వాళ్ల బ్యాగ్లు తనిఖీ చేయాలని యజమానులకు ఆదేశాలిచ్చామన్నారు.
కాగా, సమర్థవంతంగా పనిచేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, ఎస్సై అశోక్రెడ్డి, కానిస్టేబుళ్లు ఎం.యాదగిరి, వి.యుగేంధర్చారి, రాజ్కుమార్, శేఖర్, సాయికాంత్ , వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఎస్సై రంజిత్, కానిస్టేబుల్ లోకేశ్వర్, కరుడుగట్టిన నేరస్తుడు మంత్రి శంకర్ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన సౌత్జోన్ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ ఎ.విక్రమ్, నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో స్నాచర్లను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు కె.సుధాకర్, రవియాదవ్ అభినందనలు అందుకున్నారు.
కార్డన్ సెర్చ్ చేస్తాం.. కానీ..
‘సిటీలో కార్డన్ సెర్చ్ చేస్తాం.. దీనివల్ల నేరగాళ్లలో భయం, స్థానికులకు రక్షణ ఉంటుంది. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడే కార్డన్ సెర్చ్ చేయమ’ని సీపీ తెలిపారు.