న్యూఢిల్లీ, జూన్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆ విచారణకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలకు లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అక్రమాలకు సదరు ఈడీ అధికారులను బాధ్యులుగా చేసి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజుకు నోటీసులు పంపింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న యంగ్ ఇండియా సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తో, కాంగ్రెస్ పార్టీ మాజీ కోశాధికారి మోతీలాల్ ఓరాతో జరిపిన వ్యవహారాల గురించి తనకు తెలియదని ఈడీ విచారణలో రాహుల్ చెప్పినట్టు మీడియాలో వార్తలు రావడంతో కాంగ్రెస్ ఈ నోటీసులిచ్చింది. కాగా, మనీ లాండరింగ్ కేసులో తనపై జరుపుతున్న విచారణను వచ్చే సోమవారం దాకా వాయిదా వేయాలని రాహుల్ విజ్ఞప్తిని ఈడీ సమ్మతించింది.