‘నిర్మాత నిరంజన్ రెడ్డి మీదున్న సోదరప్రేమతో ఈ వేడుకకు విచ్చేశాను. చాలా తక్కువ సమయంలో ఆయన నాకు ఆప్తుడిలా మారిపోయారు. ఓ వైపు సుప్రీంకోర్టు లాయర్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సినిమాలు తీయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది’ అని అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. బుధవారం జరిగిన ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి స్వరూప్ ఆర్.జె.ఎస్ దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఈ సినిమా అద్భుతంగా ఉంది. తాప్సీ పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దారు. ‘ఝుమ్మందినాదం’ సినిమా టైమ్లో తాప్సీని చూశాను.
‘పింక్’ ‘బద్లా’ సినిమాల్లో ఆమె అభినయాన్ని చూసి ‘ఝుమ్మందినాదం’లో నటించింది తాప్సీయేనా అనిపించింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. వారిని చూస్తుంటే నన్ను నటన వైపు ఆకర్షించిన తొలిరోజులు గుర్తుకొచ్చాయి. ఎనిమిదో తరగతి టైమ్లో బాలరాజు కథలో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రభాకర్ ప్రభావం నాపై ఉంది. ఆ సినిమాతో పడిన బీజం నన్ను నటుడిలా మారేందుకు ప్రేరణనిచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీతో కలిసి నటించే అవకాశాన్ని మిస్సయ్యాను. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను చూస్తుంటే నేనెందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అనిపిస్తుంది (నవ్వుతూ). నిరంజన్ రెడ్డి తర్వాతి చిత్రంలో తాప్సీ ఉంటే తప్పకుండా నటిస్తా’ అని చిరంజీవి చమత్కరించారు.
నిర్మాత అంటే క్యాషియర్ కాదని, కథ మొదలుకొని సినిమా తాలూకు ప్రతి విషయంలో నిర్మాత ప్రమేయం ఉండాలని చిరంజీవి సూచించారు. ‘అశ్వనీదత్, అరవింద్, కె.ఎస్.రామారావు వంటి నిర్మాతలు ప్రతి విషయంపై శ్రద్ధ పెట్టేవారు. అప్పుడే ఆర్టిస్టులకు భరోసా ఉంటుంది. ఇన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీకి అలాంటి నిర్మాత నిరంజన్రెడ్డి అని చెప్పడం గర్వంగా ఉంది’ అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు పిల్లలే నిజమైన హీరోలని, రెండేళ్లుగా హిందీలో బిజీగా ఉండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయానని తాప్సీ పేర్కొంది. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ‘చిరంజీవిగారు ఈ వేడుకకు రావడంతో సినిమా సక్సెస్ అయిందని భావిస్తున్నా. ఆద్యంతం చక్కటి వినోదంతో ప్రతి ఒక్కరిని అలరించే కథ ఇది’ అన్నారు.