హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఈ ఏడాది జిల్లాలవారీగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీలు, నగరాలు, పట్టణాలకు మాత్రమే అవార్డులు ఇచ్చారు. ఈసారి జిల్లాలకు అవకాశం కల్పించారు. అవార్డుల ఎంపికకు ప్రతీ వార్డును క్షేత్రస్థాయిలో తనిఖీచేయనున్నారు. చిన్న పట్టణాలకు ప్రత్యేకత దక్కేలా 15వేలలోపు జనాభా ఉన్న పట్టణాలను ఒక క్యాటగిరీగా, 15 వేల నుంచి 25 వేల జనాభా ఉన్న పట్టణాలను మరో క్యాటగిరీగా పరిగణించనున్నారు.
డిజిటల్ ఇండియాను ప్రోత్సహించేందుకు అవార్డు ఎంపికలో సాంకేతికపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొంటారు. డిజిటల్ ట్రాకింగ్ డాక్యుమెంట్స్, శానిటేషన్, వ్యర్థాల నిర్వహణపై జియో ట్యాగింగ్, ప్రజలు తమ అభిప్రాయాలను తెలపడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నెల 30 లోగా మొదటి దశలో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆ తర్వాత స్వచ్ఛ స్ట్రీట్ ప్లే, స్వచ్ఛ జింగిల్స్, స్వచ్ఛ వ్యాసరచన పోటీలు, స్వచ్ఛ పోస్టర్ ప్రజెంటేషన్, పరిశుభ్రమైన వార్డు ఇలా వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నారు.
ఇందులో విద్యాసంస్థలు, వార్డు ప్రజాప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్, ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువతను భాగస్వామ్యం చేయనున్నారు. స్వచ్ఛ ఇన్నోవేషన్, బెస్ట్ అవుట్ ఆఫ్ వెస్ట్ కాంపిటీషన్, వాల్ ఆర్ట్ కాంపిటీషన్, స్వచ్ఛత కాంపిటీషన్ను డిసెంబర్ 7లోగా పూర్తి చేస్తారు. ఇప్పటికే తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకోగా, వచ్చే ఏడాది అత్యధికంగా అవార్డులు అందుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకోసం 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ క్షేత్రస్థాయి ప్రణాళికను ఖరారుచేసింది.