హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చెత్త కనిపించదు.. ప్రతిరోజు ఎక్కడిక్కక్కడ ఏరేసిన చెత్త డంపింగ్ యార్డులకు తరలింపు.. చెత్త రవాణాకు 5 వేల వాహనాల కొనుగోలు.. తడి, పొడి చెత్తకు వేర్వేరుగా 31 లక్షల చెత్త బుట్టల అందజేత.. అర్బన్ ఫారెస్టుల్లో పచ్చదనం.. ప్రతి పట్టణంలో వెయ్యిమందికి ఒకటి చొప్పున మరుగుదొడ్డి నిర్మాణం.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం.. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేసిన పనులివి.. ఫలితంగా 2021 సంవత్సరానికిగాను రాష్ట్రంలోని ఎనిమిది పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికయ్యాయి. జీహెచ్ఎంసీ, సిరిసిల్ల, సిద్దిపేట, నిజాంపేట, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కోస్గి, హుస్నాబాద్ పట్టణాలను ఈ అవార్డులు వరించాయి. వీటితోపాటు కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 20న ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
దేశంలోని పట్టణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం అంశాల్లో ఆరువేల మార్కుల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రజల ఫీడ్ బ్యాక్, చెత్తను ఏరివేయడం, ప్రాసెసింగ్, డిస్పోజబుల్, గార్బెజ్ ఫ్రీ సిటీస్ (జీఎఫ్సీ), డీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్ సిటీస్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడానికి దోహదం చేసింది. పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం, స్వచ్ఛ సర్వేక్షణ్లో అవే అంశాలు ప్రధానంగా ఉండటంతో రాష్ట్రంలోని ఎనిమిది పట్టణాలకు అవార్డులు దక్కాయి.