సూర్యాపేటసిటీ, డిసెంబర్ 28 : ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేలా సూర్యాపేట జిల్లా పోలీసుశాఖ పని చేస్తున్నదని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక క్రైం నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది సూర్యాపేట జిల్లాలో తీవ్రమైన నేరాలను 11.2 శాతం తగ్గించామన్నారు. కోర్టు సంబంధించిన కేసుల్లో 4041 ఎఫ్ఐఆర్ కేసులను, 2600 ఈ పెటీ కేసులు, 11వేల ఇతర కేసులకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. 45 మంది నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేశామన్నారు. ఇందులో ఆరుగురికి జీవితఖైదు పడిందన్నారు. జిల్లాలో వ్యవస్తీకృత నేరాలను పూర్తిగా నిరోధించామని, ఎన్ఫోర్స్మెంట్ పెంచి ప్రతి రోజూ మూడు విడుతల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 144 మందిపై 55 కేసులు నమోదు చేసి 2.2 టన్నుల గంజాయిని సీజ్ చేసినట్లు చెప్పారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, సీజ్ చేసిన గంజాయిలో 1.4 టన్నులు కాల్చి నిర్వీర్యం చేశామన్నారు.
గంజాయి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి కాకుండా నిరోధించినట్లు చెప్పారు. 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించి 4.5 నిమిషాల్లోనే బాధితులకు సేవలు అందించినట్లు తెలిపారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే ఉద్దేశంతో 2495 మందిని కస్టడీకి తీసుకొని 1100 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో 8లక్షలకు పైగా వాహనాలను తనిఖీ చేశామన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో ఫంక్షనల్ వర్టికల్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీజ్ చేసి, యజమానులు తీసుకెళ్లకుండా ఉన్న 485 వాహనాలను వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేశామన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 2700 మంది అభ్యర్థులు రాగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించామన్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న 400 మంది పేద అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం సహకారంతో ఇండోర్, ఔట్డోర్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించినట్లు తెలిపారు. ఇందులో 158 మంది వరకు ఫైనల్ పరీక్షకు ఎంపికైనట్లు చెప్పారు. జిల్లాలో దొంగతనాలకు గురైన సొత్తు 58 శాతం రికవరీ చేశామన్నారు.
79వేల వాహనాల తనిఖీ
రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించామన్నారు. వాహనాలను తనిఖీ చేస్తూ మూడు లక్షల 79వేల వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. 133 తీవ్రమైన నేరాలను నమోదు చేశామన్నారు. 14140మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా 60మందికి జైలు శిక్షలు పడ్డాయని తెలిపారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 8148 మందిపై కేసులు నమోదు చేశామని 5400 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్మైల్ ద్వారా 180 మంది పిల్లలను గుర్తించినట్లు చెప్పారు. మహిళా వేధింపులకు సంబంధించి 645 కేసులు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 560 కేసులు నమోదయ్యాయన్నారు. షీటీమ్స్ ద్వారా 242 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 110 ఫిర్యాదులు రాగా 95 కౌన్సెలింగ్స్ నిర్వహించినట్లు చెప్పారు. భరోసా సెంటర్లో 122 కేసుల్లో 120 మందికి కౌన్సెలంగ్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు.