యాదాద్రి, మార్చి 10 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మహాఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించి కల్యాణ తంతును వీక్షించనున్నారు. గతంలో 2015, 2016 సంవత్సరంలో జరిగిన కల్యాణోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తాజాగా బాలాలయంలో 6వ సారి జరిగే ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
19వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్…
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి సీఎం కేసీఆర్ శుక్రవారం 19వ సారి రానున్నారు. ఆలయ పునర్నిర్మాణాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు ఐదేండ్లుగా ఏడాదిలో రెండు, మూడు దఫాలుగా వచ్చి పనులను స్వయంగా పరిశీలించి సమీక్షలు నిర్వహించారు. పనులు దాదాపుగా పూర్తికాగా గతేడాది ఆక్టోబర్ 19న మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు చేసి వెళ్లారు. ఇందులో భాగంగా కుంభాల్లో మంత్ర జలాలను ఆవాహనం చేసి వాటితో ఆలయ రాజగోపురంపై ఏర్పాటు చేసిన కలశాలు, గర్భాలయ గోపురాన్ని అభిషేకం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా గోపురంపై కలశస్థాపన, ఆలయ పునర్నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర సందర్భాల్లోనూ మహాకుంభ సంప్రోక్షణ క్రతువు నిర్వహించడం ఆగమశాస్త్ర సంప్రదాయం.
ప్రెసిడెన్షియల్ సూట్లో..
మహాకుంభ సంప్రోక్షణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించే అవకాశాలున్నట్లు అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. కల్యాణోత్సవం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లి మధ్యాహ్నం భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం ఈ నెల 21న ప్రారంభం కానున్న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ, యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు భక్తుల వసతి కోసం చేపట్టిన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా గర్భాలయంలో బంగారు తాపడం పనులు, కలశస్థాపన, వారం రోజులపాటు మహాకుంభ సంప్రోక్షణ పూజల విధివిధాలపై సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది.