నల్లగొండ ప్రతినిధి, మార్చి10(నమస్తే తెలంగాణ) : ఆటంకాలను అధిగమించి, స్థానికతకు పెద్దపీట వేసి, సర్కారు కొలువులను తెలంగాణ సమాజం ముందుంచిన సీఎం కేసీఆర్కు యువత జేజేలు పలుకుతున్నది. ప్రభుత్వ శాఖల్లో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని నిండు సభలో ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. రెండోరోజూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు సాగాయి. కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న యువత, టీఆర్ఎస్వీ నాయకులు, గులాబీ శ్రేణులు ఎవరికివారుగా వేడుకలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్… జై తెలంగాణ నినాదాలు హోరెత్తించారు. విద్యావంతులతోపాటు ఉద్యోగాలకు సమాయత్తమవుతున్న అభ్యర్థులు ఎక్కడ నలుగురు కలిసినా ఉద్యోగాల భర్తీ ప్రకటనపైనే మాట్లాడుకుంటున్నారు. అన్ని విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడం వల్ల ఎక్కువమందికి అవకాశాలు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీ ప్రకటనతో కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది.
ఉద్యోగాల ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా సంబురాలు వెల్లువెత్తాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో పలుచోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న కోచింగ్ సెంటర్ అభ్యర్థులు సంబురాల్లో పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై నిరుద్యోగ యువతకు స్వీట్లు పంచారు. అనంతరం పటాకులు కాలుస్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మరో కోచింగ్ కేంద్రంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీను ఆధ్వర్యంలో యువత సంబురాల్లో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్… జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. కేతేపల్లిలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. సూర్యాపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో పాఠకులు, అభ్యర్థులు సంబురాలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్కు స్వీట్లు తినిపిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ కేవలం కేసీఆర్తోనే సాధ్యమైందని పలువురు ప్రశంసించారు. పెన్పహాడ్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించి సంబురాలు చేశారు. మునగాల మండలం కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
మఠంపల్లి, గరిడేపల్లి మండలం కల్మలచెర్వులో, అనంతగిరిలోనూ టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సంబరాల్లో మునిగితేలారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు తాకిడి పెరిగింది. గురువారం చాలా కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు పరుగులు తీశారు. ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, టైంటేబుల్, ఫీజు తదితర వివరాలపై ఆరా తీస్తూ కనిపించారు. వారం రోజుల్లో అన్ని కోచింగ్ సెంటర్లు కొత్త బ్యాచ్లతో కళకళలాడనున్నాయి. ఉద్యోగం సాధించాలనుకుంటున్న వారంతా సీఎం కేసీఆర్ ప్రకటనతో ఇక ముందు క్షణం తీరికలేకుండా గడుపనున్నారనడంలో సందేహం అక్కర్లేదు.
ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. జిల్లా, జోనల్, మల్టీ జోన్ల్ స్థాయిల్లో పోస్టులను వేర్వేరుగా భర్తీ చేయనుండడంతో అభ్యర్థులకు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లాలో 1,398, సూర్యాపేట జిల్లాలో 719, యాదాద్రి జిల్లాలో 1,010 జిల్లా స్థాయి పోస్టులు గుర్తించగా, యాదాద్రి జోన్లో 2,160 పోస్టులు, మల్టీ జోన్లో 6,370 పోస్టులు భర్తీ చేయనున్నారు. దాంతో పాటు గరిష్ఠంగా పదేండ్ల పాటు వయోపరిమితిని కూడా పెంచడంతో అందరికీ అవకాశాలు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. విపక్షాల కుట్రపూరిత ప్రకటనలను సామాన్యులు అసహ్యించుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. అయితే, విపక్షాలు కుట్రపూరితంగా కోర్టు కేసులతో అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేస్తున్నాయి. అనేక అడ్డంకులను ముందే ఊహించిన సీఎం కేసీఆర్ పకడ్బందీగా జోనల్ విధానాన్ని తీసుకువచ్చారు. ఉద్యోగులను క్యాడర్ను బట్టి సర్దుబాటు చేస్తూ ఖాళీలను గుర్తించగా క్రమపద్ధతిలో భర్తీ చేసేందుకు అసెంబ్లీ వేదికగా భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఉమ్మడి జిల్లా అంతటా సంబురాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు జిల్లా అంతటా సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుతూ, పటాకులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా సంబురాలు కొనసాగాయి.
ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం
సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన హర్షణీయం. ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసిన తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాం. అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు. ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం ఉన్నది.
– బి.ప్రవీణ్, పిల్లలమర్రి గ్రామం
నిరుద్యోగులకు భరోసా..
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన నిరుద్యోగులకు భరోసా కల్పించింది గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల హృదయాల్లో స్థానం సంపాదించారు. గతంలో స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్న చాలా మంది ఉద్యోగాలు సాధించారు. అదే తరహాలో మేము కూడా ఈ సారి తప్పకుండా ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం ఉంది. మాకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నారు.
– పి.కరుణశ్రీ, రామలక్ష్మీపురం, కోదాడ మండలం