ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతు బీమా అందించడంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందించాలని, జిల్లాలో టీకా నమోదులో మొదటి డోసు 80 శాతం, రెండో డోసు 44 శాతం పూర్తికావడంతో వైద్యాధికారులను అభినందించారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు.
తుర్కపల్లి, అక్టోబర్ 22 : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మోతీరాంతండాలో శుక్రవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణవైపు మొగ్గు చూపడం ద్వారా ఆర్థికంగా ఎదుగవచ్చన్నారు. ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ అధ్వర్యంలో అనేక సబ్సిడీలతో పాటు ఉచితంగా మందులను అందిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై నాటుకోళ్ల పెంపకం గొర్రెలు, మేకల యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. యూనిట్ల నిర్వహణకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ సైతం అందిస్తుందన్నారు. పంట దిగుబడికి అనుగుణంగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి కృష్ణ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, తుర్కపల్లి, బొమ్మలరామారం పీఏసీఎస్ చైర్మన్లు సింగిరెడ్డి నరసింహారెడ్డి, గూదె బాల నర్సింహ, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ బిచ్చూనాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్ పాల్గొన్నారు.