తమిళ అగ్ర హీరో సూర్య వితరణశీలత గురించి అందరికి తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచారాయన. తాజాగా సూర్య కన్యాకుమారిలోని కొందరు మత్స్యకారుల కుటుంబాలకు ఉచితంగా ఇల్లు అందించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…బాలా దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం తమిళనాడు కన్యాకుమారిలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందులో సూర్య మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ వ్యయంతో మత్స్యకారుల గుడిసెల సెట్ను నిర్మించారు. షూటింగ్ నిమిత్తమే అయినా చక్కటి నాణ్యతతో నివాసయోగ్యంగా ఈ గుడిసెలను తీర్చిదిద్దారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఆ గుడిసెలను కూల్చివేయకుండా పేద మత్స్యకారులకు అందించాలని సూర్య నిర్ణయించారు. గొప్ప మానవతా దృక్పథంతో సూర్య తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడిప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.