పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహనటీనటులకు పసందైన ఇంటిభోజనాన్ని తెప్పించి అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తుంటారు. ఆయన తయారు చేయించే వంటకాల మెనూ చూస్తే ఎంతటి జిహ్వ చాపల్యం ఉన్న వారైనా సంతుష్టులు కావాల్సిందే. దీపికాపడుకోన్ మొదలుకొని బాలీవుడ్ బిగ్బీ అమితాబ్బచ్చన్ వరకు ప్రభాస్ అతిథ్యాన్ని స్వీకరించి ముగ్ధులయ్యారు. తాజాగా తమిళ అగ్రహీరో సూర్య…ప్రభాస్ తయారుచేయించిన బిర్యానీ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన జీవితంలో ఆరగించిన అత్యుత్తమ బిర్యానీ అదేనని మెచ్చుకున్నారు. ‘కొన్ని సంవత్సరాల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో మా ఇద్దరి చిత్రాల షూటింగ్స్ జరిగాయి. ఓ రోజు ప్రభాస్ సెట్కు వచ్చి రాత్రి డిన్నర్కు ఆహ్వానించారు. నా షూట్ పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలు కావడంతో ప్రభాస్కు సారీ చెబుదామనుకున్నా. అదే సమయంలో నా రూమ్కి వచ్చిన ప్రభాస్ ‘మీ కోసమే వెయిట్ చేస్తున్నా సర్..బిర్యానీ రెడీగా ఉంది. త్వరగా వచ్చేయండి’ అని చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి ప్రభాస్తో కలిసి తిన్న బిర్యానీని ఎన్నటికీ మర్చిపోలేను. ప్రభాస్ ఆతిథ్యం నన్ను కట్టిపడేసింది’ అని సూర్య చెప్పుకొచ్చారు.