మిగతా రాష్ర్టాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్ను ఇన్నేండ్లు ప్రత్యేకంగా నిలిపిన ఆర్టికల్ 370 కాలగర్భంలో కలిసిపోయింది. భారత ప్రభుత్వం, జమ్మూకశ్మీర్కు మధ్య ఉండే చిన్నపాటి సన్నని తెర కూడా తొలగిపోయింది. ఆర్టికల్ 370 రద్దు సబబేనని, రాజ్యాంగబద్ధమేనని భారత సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఒక వివాదాస్పద అధ్యాయం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సహా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దేశ చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువరిస్తూ సార్వభౌమత్వం అనేది దేశానికే ఉంటుంది తప్ప ప్రాంతాలకు కాదని స్పష్టం చేయడం గమనార్హం.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రాంతాల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదనే సూత్రీకరణ ఈ తీర్పు సారాంశం. దేశ సమగ్రత విషయంలో రాజీ పడకుండా ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. మరోవైపు ఒకే దేశంలో రెండు సార్వభౌమాధికారాలకు తావు లేదని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోసారి స్పష్టం అయింది. గతాన్ని మరిచి భవిష్యత్తు వైపు అడుగులు వేయడం ఇటు దేశానికి, అటు కశ్మీర్కు శ్రేయస్కరమని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించడాన్ని బట్టి తెలుస్తున్నది. అయితే జస్టిస్ కౌల్, జస్టిస్ ఖన్నా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూనే వేర్వేరుగా మరో రెండు తీర్పులను వెలువరించారు. కశ్మీర్లో సుస్థిరత, అభివృద్ధి, శాంతిభద్రతలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై వారు అందులో ప్రస్తావించారు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును దాదాపుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించడం కశ్మీర్ సమస్యపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని సూచించే అంశం. ఈ తీర్పుపై కేంద్రంలోని బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా జమ్మూకశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఎంతో సున్నితమైన ఈ అంశంపై రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే రాజకీయాలకు తావు లేకుండా తమ తమ అభిప్రాయాలను ఆయా పార్టీల నేతలు వినిపించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా సుప్రీంకోర్టు తీర్పును ముక్తకంఠంతో స్వాగతించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు జమ్మూకశ్మీర్లో ప్రజా పాలన రావాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ అధినేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించడాన్ని స్వాగతించాల్సిందే.
ఒకసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే.. 1947లో మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నలుగుతున్న ఈ సమస్య సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చినట్టు అయింది. ఆనాడు సంక్షోభ పరిస్థితుల్లో తప్పనిసరై తీసుకొచ్చిన ఆర్టికల్ 370.. కాలక్రమంలో జఠిల సమస్యగా మారిపోయింది. 1947లో భారత్కు స్వాతంత్య్రం వచ్చాక కశ్మీర్ సహా దేశంలోని సుమారు 562 వరకు చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలు భారత్లో విలీనం అయ్యాయి.
కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు కూడా సాఫీగానే భారత్లో విలీనమైపోయాయి. కానీ ఆనాటి నుంచి నేటి వరకు కశ్మీర్ అంశం మాత్రం కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. అప్పటి కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కారణంగా తెరపైకి వచ్చిన ఆర్టికల్ 370 దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్ వల్ల జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి సిద్ధించింది. ఒకే దేశం రెండు జెండాలుగా పరిస్థితి మారిపోయింది. కశ్మీరీ ప్రజలకు మనమూ భారత్లో అంతర్భాగం అనే భావన లేకుండాపోయింది. తాము ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ప్రత్యేకమనే భావన వారిలో పాతుకుపోయింది. ఈ కారణంగానే అక్కడ సీమాంతర ఉగ్రవాదం వేళ్లూనుకుపోయింది.
కశ్మీర్ అంశంపై మొదటి నుంచి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది పాకిస్థాన్ ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పుపై కూడా విషం కక్కింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పును తప్పుబట్టారు. జమ్మూకశ్మీర్పై భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే పాక్ వైఖరి స్పష్టం అవుతున్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను ఆసరాగా చేసుకొని పాకిస్థాన్ మొదటి నుంచి కశ్మీర్ను అస్థిర పరచాలని చూస్తున్నది. కశ్మీర్పై పట్టు సాధించేందుకు పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. భారత్లో కల్లోలం సృష్టించేందుకే ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది. అందులో భాగంగానే భూతల స్వర్గం పీవోకేను ఉగ్రవాదుల అడ్డాగా మార్చేసింది. ఉగ్ర స్థావరాలకు పీవోకే కేరాఫ్గా మారిపోయింది. భారత సరిహద్దులకు సమీపంలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పాక్ సైనికుల పహారాలో సరిహద్దు కంచెలను దాటి భారత్లోకి చొరబడుతున్నారు. కొండలు, అటవీ ప్రాంతాల్లో నక్కి ఉంటున్న తీవ్రవాదులు కశ్మీర్లో శాంతికి భంగం కలిగిస్తున్నారు. అందుకే మొదటి నుంచి ఆర్మీకి శాశ్వత స్థావరంగా కశ్మీర్ మారిపోయింది. మరోవైపు వేర్పాటువాదుల ముసుగులో అమాయక కశ్మీరీ ప్రజలకు లేనిపోనివి నూరిపోసి కొంతమంది పబ్బం గడుపుకొంటున్నారు. స్వార్థపరుల కారణంగా విద్య, ఉపాధికి దూరమవుతున్న అక్కడి యువత సంఘ విద్రోహ శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు.
ఆర్టికల్ 370ను పార్లమెంట్ రద్దు చేసిన నాటి నుంచి అక్కడి ప్రజలు తమ ఉనికిని కోల్పోయినట్టు భావిస్తున్నారు. ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నారు. మనకు ఆర్టికల్ 370 అనేది ఒక అధికరణం మాత్రమే కావచ్చు. కానీ, అక్కడి ప్రజలకు ఇది ఒక భావోద్వేగంతో కూడిన అంశం. పైగా ఏండ్లుగా వారు తమను ప్రత్యేకంగా ఉంచిన ఆర్టికల్ 370 లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోవచ్చు. అక్కడి వేర్పాటువాద నేతలు కూడా దీనికి ఓ కారణం. అసలు ఆర్టికల్ 370 అనేదే కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకి అనే అంశాన్ని వారికి వివరించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ముందుగా చేయాల్సిన పని ఇదే. దీని నుంచి బయటపడి ప్రగతి వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని వారికి నొక్కి చెప్పాలి.
ప్రకృతి రమణీయతకు మారుపేరైన కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఆర్టికల్ 370 కాలగర్భంలో కలిసిపోవడంతో ఇకపై దాని గురించి మర్చిపోయి ప్రగతి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ముందుగా అక్కడ సుస్థిరతను ఏర్పరచాలి. శాంతిభద్రతలను నెలకొల్పాలి. మానవ హక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూడాలి. శాంతిభద్రతలు అదుపుతప్పిన చోట అభివృద్ధి, ప్రగతి కుంటుపడతాయి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతికి శాంతిభద్రతలు అదుపులో ఉండటమూ ఓ కారణం అనేది గుర్తుంచుకోవాలి. మరోవైపు స్థానికేతరులు అక్కడి భూములు కొనేందుకు వీలు లేకపోవడం కూడా కశ్మీర్ అభివృద్ధికి అవరోధంగా మారింది.
భారత్లో విలీనం అయిన నాటి నుంచి జమ్మూకశ్మీర్ అత్యధిక కాలం గవర్నర్ల పాలనలోనే ఉన్నది. 2018లో మెహబూబా ముఫ్తీ పాలన ముగిసిన తర్వాత మళ్లీ అక్కడ ఎన్నికలే జరగలేదు. అప్పటి నుంచి నేటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే జమ్మూకశ్మీర్ ఉన్నది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నాటి నుంచి జవాన్ల పహారాలోనే కశ్మీర్ ఉన్నది. అత్యధిక కాలం ఆర్మీ పహారా ఉండటం కూడా మంచిది కాదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్కడ ప్రజా పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలి. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు, రిజర్వేషన్ల బిల్లులు ప్రజా పాలన దిశగా దోహదం చేస్తాయని ఆశించవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఏడాదిలోపు ఎన్నికలు నిర్వహించి ప్రజా పాలనను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జవాన్ల పహారాలో తాత్కాలికంగా శాంతిభద్రతలు నెలకొల్పినంత కాలం కశ్మీర్లో సుస్థిరత ప్రశ్నార్థకమే!
-మాలోతు సురేష్
98856 79876