న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రజలు ఆకలితో అలమటించి చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా ముఖ్యమైన బాధ్యతేదీ లేదని తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా సామూహిక వంటశాలల (కమ్యూనిటీ కిచెన్లు) ఏర్పాటుకు ‘విధాన రూపకల్పన’పై కేంద్రప్రభుత్వం స్పందించిన తీరును తప్పు పట్టింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఈ అఫిడవిట్లో ఎక్కడా లేదు.
కనీసం ఆ ఆలోచన చేస్తున్నట్టు కూడా లేదని అర్థమవుతున్నద’ని ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపంతో దేశంలో ఎంతోమంది చనిపోతున్నారని, దీన్ని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసేలా కేంద్రం, రాష్ర్టాలను ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇది కేవలం పౌష్టికాహారానికే సంబంధించి కాదని, దేశంలో ఇంకా ఆకలి మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఒకే విధానంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు గతంలోనే కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దాన్ని అండర్ సెక్రటరీ స్థాయి అధికారి సమర్పించడం, అందులోనూ తాము కోరిన వివరాలు లేకపోవడంపై కోర్టు అసహనం ప్రకటించింది. ‘మీరు వ్యవస్థలను గౌరవించాలి. సెక్రటరీ స్థాయి అధికారి ఎందుకు అఫిడవిట్ ఫైల్ చేయలేదు? మేం ఒకటి చెప్తాం. అఫిడవిట్లో మీరు ఇంకోటి ఇస్తారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఇది చివరి హెచ్చరిక’ అని కేంద్రాన్ని హెచ్చరించింది. కమ్యూనిటీ కిచెన్ల కోసం ఉమ్మడి పథకాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధ్వీ దివాన్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదించారు. రాష్ర్టాలతో సమావేశమై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల సమయం కోరారు. ‘రాష్ర్టాలతో సమన్వయం కాకుండా ఈ అంశంలో కేంద్రం ఏం చేయలేదని మేం గతంలోనే స్పష్టంగా చెప్పాం. మీరు ఆకలి నిర్మూలనకు చర్యలు తీసుకొంటామంటే ఏ రాజ్యాంగ సంస్థ, చట్టం.. వద్దు అనవు’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అఫిడవిట్ సమర్పణకు మూడు వారాల గడువు ఇచ్చారు. రాష్ర్టాలకు ఆమోదయోగ్యమైన పాలసీని రూపొందించాలని, అఫిడవిట్ను సెక్రటరీ స్థాయి అధికారి సమర్పించాలని ఆదేశించారు. ‘ఒకవేళ రాష్ర్టాలకు ఏమైనా అభ్యంతరాలుంటే తరువాతి విచారణలో పరిగణనలోకి తీసుకొంటాం’ అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే సమావేశానికి అన్ని రాష్ర్టాలు హాజరు కావాలని ఆదేశించారు.
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు గతంలోనే కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాలు వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆకలి మరణాలు సంభవిస్తున్న రాష్ర్టాల్లో వివరాలు సేకరించాలని కోరింది. రాష్ర్టాల అభిప్రాయాలను కూడా అడిగింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై 2019 అక్టోబర్ 18న సానుకూలత ప్రకటించింది. దేశంలో ఆకలి సమస్య తీరడానికి ఇలాంటి వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన్ సింగ్ కమ్యూనిటీ కిచెన్ల కోసం పిల్ దాఖలు చేశారు.
తెలంగాణలో 5 రూపాయలకే భోజనం పెట్టే రాష్ట్ర ప్రభుత్వ అన్నపూర్ణ క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు కమ్యూనిటీ కిచెన్లకు ఉదాహరణలు. పేదలకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తక్కువ ధరలో అందించడం వీటి ఉద్దేశ్యం. ఆకలితో ఎవరూ అలమటించవద్దని కొన్ని రాష్ర్టాలు ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఇలాంటివి ఏర్పాటు చేయాలని, దీనికోసం ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పేదలకు తక్కువ ధరలో ఆహారం దొరుకుతుంది. నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన కూలీలు, పేదలు ఇబ్బంది పడకుండా ఈ కిచెన్లు ఆకలి
తీరుస్తాయి.