న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కర్ణాటకలో ఉద్రిక్తతలకు కారణమైన హిజాబ్ వస్త్రధారణ అంశంపై సరైన సమయంలో విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివాదాన్ని జాతీయ స్థాయి సమస్యగా మార్చొద్దని హితవు పలికింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తామని ఉద్ఘాటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. విద్యాసంస్థల్లో వస్త్రధారణపై విధించిన ఆంక్షలపై తుది తీర్పు వెలువడే వరకూ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు మతపరమైన దుస్తులు వేసుకురావొద్దంటూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
5 వేల మందితో భారీ నిరసన
హిజాబ్ ధారణకు మద్దతుగా మహారాష్ట్రలోని మాలెగావ్లో 5 వేలమంది విద్యార్థినులు గురువారం నిరసన చేపట్టారు. అనుమతులు లేనప్పటికీ నిరసన చేపట్టినందుకు నలుగురు ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యూనిఫాం మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వండి..
‘స్కూళ్లలో విద్యార్థులు యూనిఫాం మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వండి. విద్యాసంస్థల్లో హిజాబ్, బుర్ఖా వస్త్రధారణను అనుమతించొద్దు’ అని ప్రధానికి ఆలిండియా బార్ అసోసియేషన్ లేఖ రాసింది. భారత్లో హిజాబ్ ధరించి కాలేజీలకు వెళ్తున్న ముస్లిం విద్యార్థినులను హిందూత్వ మూకలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఫ్రెంచ్ ఫుట్బాల్ ఆటగాడు పౌల్ పోగ్బా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
నిన్నటిదాకా మట్టిలో పాతిపెట్టారు.. ఇప్పుడు హిజాబ్తో కప్పేస్తున్నారు: కేరళ గవర్నర్
ఖురానులో హిజాబ్ను ఓ వస్త్రవిశేషంగా ఎక్కడా చెప్పలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. నిన్నటిదాకా ఆడబిడ్డలను మట్టిలో పాతిపెట్టారని, ఇప్పుడు హిజాబ్లో కప్పేస్తున్నారని పేర్కొన్నారు.
ముస్లిం మహిళల హక్కులను అడ్డుకుంటున్న విపక్షాలు: మోదీ
ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించినందువల్ల బీజేపీపై ముస్లిం మహిళల్లో పెరిగిన మద్దతు చూసి కలత చెందుతున్న విపక్షాలు వారి హక్కులను అడ్డుకొనేందుకు దారులు వెదుకుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. యూపీలోని సహారన్పూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు.