బొంరాస్పేట, నవంబర్ 24 : జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్నది. వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల సాగును ప్రభుత్వం ప్రోత్సహించడం, గత ఏడాది మార్కెట్లో అధికంగా ధర పలుకడంతో ఈసారి వేరుశనగ సాగు రెట్టింపైంది. వరి పంట కంటే తక్కువ నీటి వినియోగం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే వేరుశనగను యాసంగి సాగుకు రైతులు ఎంచుకుంటున్నారు. వానకాలంలో సాగు చేసిన పెసర, బెబ్బెర, మినుములు వంటి పంటలు చేతికొచ్చిన తరువాత రైతులు వాటి స్థానంలో యాసంగిలో వేరుశనగ సాగుకు మొగ్గు చూపుతారు. ప్రభుత్వం తుంపర సేద్యం సాగును ప్రోత్సహించడానికి పరికరాలపై భారీగా రాయితీ ఇవ్వడంతో బోర్ల కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వీటికి తోడు 24 గంటల విద్యుత్ను సరఫరా చేయడం, పెట్టుబడి సాయం అందిస్తుండడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. బోర్ల కింద ఈ యాసంగిలో వేరుశనగ పంటను సాగు చేశారు. జిల్లాలో గత ఏడాది యాసంగిలో 8,246 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ పంటను సాగు చేస్తే ఈ ఏడాది యాసంగిలో 18,958 ఎకరాల్లో వేరుశనగను పండిస్తున్నారు. జిల్లాలోని బొంరాస్పేట, దోమ, కులకచర్ల, బషీరాబాద్, యాలాల మండలాల్లో ఉన్న చెల్క భూముల్లో వేరుశనగను పండిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండలంలోనే వేరుశనగను ఎక్కువగా 5,970 ఎకరాల్లో సాగు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తే వేరుశనగ సాగే మేలని రైతులు పేర్కొంటున్నారు.
మండలాల వారీగాసాగు వివరాలు..
బొంరాస్పేట మండలంలో 5,790 ఎకరాలు, దౌల్తాబాద్లో 1,285, కొడంగల్లో 889, దోమలో 2,685, కులకచర్లలో 3,145, పరిగిలో 364, బషీరాబాద్లో 2,350, పెద్దేముల్లో 210, తాండూరులో 452, యాలాల్లో 1,233, బంట్వారంలో 10, ధారూరులో 365, కోట్పల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగను సాగు చేశారు.