ఢిల్లీ క్యాపిటల్స్ కమాల్ చేసింది. ప్లే ఆఫ్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో సత్తాచాటింది. వార్నర్, పావెల్ అజేయ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న ఢిల్లీ.. సన్రైజర్స్ హైదరాబాద్కు కళ్లెం వేసింది. రైజర్స్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ వార్నర్, పావెల్ ద్వయం పరుగుల మోత మోగించింది. లక్ష్యఛేదనలో పూరన్, మక్రామ్ పోరాడినా లాభం లేకపోయింది. ఈ విజయంతో ఢిల్లీ ఐదో స్థానానికి ఎగబాకితే.. హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది.
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు గాడి తప్పింది. వరుస విజయాలతో దూకుడు కనబరిచిన రైజర్స్ హ్యాట్రిక్ ఓటములు ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న వేళ రైజర్స్ సత్తాచాటడంలో విఫలమైంది. గురువారం జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్లో హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 92 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్స్లు), రోవ్మన్ పావెల్(35 బంతుల్లో 67 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీలతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 207/3 స్కోరు చేసింది. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెనర్ మణ్దీప్సింగ్(0) వికెట్ను ఢిల్లీ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన మిచెల్ మార్ష్(10) ఘోరంగా నిరాశపర్చగా, కెప్టెన్ రిషబ్ పంత్(26) స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. 85 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీని వార్నర్, పావెల్ ఆదుకున్నారు. వీరిద్దరు రైజర్స్ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. వార్నర్ ఆది నుంచే దూకుడు కనబర్చగా, ఆఖర్లో పావెల్ విరుచుకుపడ్డాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ను లక్ష్యంగా చేసుకుంటూ పావెల్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. మాలిక్ బుల్లెట్లాంటి బంతులను అంతే వేగంగా బౌండరీలకు తరలించి వారెవ్వా అనిపించాడు. భువనేశ్వర్, అబాట్, గోపాల్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 186/8 స్కోరుకు పరిమితమైంది. నికోలస్ పూరన్(34 బంతుల్లో 62, 2 ఫోర్లు, 6 సిక్స్లు), మక్రామ్(25 బంతుల్లో 42, 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(7), కెప్టెన్ విలియమ్సన్(4) తీవ్రంగా నిరాశరిచారు. 24 పరుగులకే రైజర్స్ ఓపెనర్లను కోల్పోయింది.
మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి(22) నిలదొక్కుకోలేకపోగా, పూరన్, మక్రామ్ ఇన్నింగ్స్ను చక్కబెట్టారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో రైజర్స్ కోలుకోలేకపోయింది. ఆఖర్లో పూరన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఖలీల్ అహ్మద్(3/30), శార్దుల్(2/44) విజృంభించారు. అజేయ అర్ధసెంచరీతో రాణించిన వార్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. శుక్రవారం గుజరాత్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ తో మ్యాచ్లో ఉమ్రాన్ గంట కు 157కి.మీల వేగంతో బంతి వేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్త మ వేగంగా రికార్డుల్లోకెక్కింది. ఇదే మ్యాచ్లో ఉ మ్రాన్ 155.6, 154.8, 154కి.మీల వేగంతో బంతు లు విసిరాడు.
ఢిల్లీ: 20 ఓవర్లలో 207/3(వార్నర్ 92 నాటౌట్, పావెల్ 67 నాటౌట్, భువనేశ్వర్ 1/25, గోపాల్ 1/34), హైదరాబాద్: 20 ఓవర్లలో 186/8(పూరన్ 62, మక్రామ్ 42, ఖలీల్ అహ్మద్ 3/30, శార్దుల్ 2/44)