Suno India Podcast | నిజం రేజర్ లాంటిది. సీజర్ను కూడా వదిలిపెట్టదు- అంటాడో కవి! సీజర్ చక్రవర్తి అయినా సరే, షేవింగ్ చేసుకుంటున్నప్పుడు రేజర్ కదలికలను బట్టి తల దించాల్సిందే,వంచాల్సిదే! ‘సునో ఇండియా’ సహ-వ్యవస్థాపకురాలు డీవీఎల్ పద్మప్రియ అభిప్రాయమూ దాదాపుగా ఇలాంటిదే. నిజానికి ప్రచారం అవసరం లేదు, నిఖార్సయిన సత్యానికి బ్రాండింగ్తో పని లేదని బలంగా విశ్వసిస్తారామె. ఆ నమ్మకమే ‘సునో ఇండియా’ పాడ్కాస్ట్లను లక్షలమందికి చేరువ చేస్తున్నది.
నేను పెరిగింది, చదువుకున్నది.. అంతా హైదరాబాద్లోనే. జర్నలిజం అంటే చిన్నప్పటినుంచీ ఆసక్తి. జీవితాలకు సంబంధించిన కథలు వినేదాన్ని, చదివేదాన్ని, రాసేదాన్ని. వ్యాసరచన పోటీల్లోనూ ముందుండేదాన్ని. సెయింట్ ఫ్రాన్సిస్లో డిగ్రీ చేశాను. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ‘ది హిందూ’ వంటి వార్తా సంస్థల్లో పనిచేశాను. చివరగా ఢిల్లీలోని ‘డాక్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థలో ఐదేండ్లు పనిచేశాను. నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు అక్కడికెళ్లి రిపోర్ట్ చేశాను. నలుగురి మధ్యా ప్రస్తావనకు రాని అనేకానేక విషయాలను రచ్చబండ చర్చకు తీసుకురావాలనే ఆలోచనలోంచి పుట్టిందే.. ‘సునో ఇండియా’. ఊహలకు, కల్పనలకు తావులేని నిఖార్సయిన వార్తా విశేషాలను అందించాలనే ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ని ప్రారంభించాం. ‘డాక్టర్స్ వితౌట్ బార్డర్స్’లో నా సహోద్యోగి తరుణ్ నిర్వాణ్, నా భర్త రాకేశ్ కమల్‘ైక్లెమేట్ రియాలిటీ’ అనే సంస్థలో పనిచేసేవారు. మా ముగ్గురి ఆలోచనే ‘సునో ఇండియా’. మా పాడ్కాస్ట్కు దాదాపు ఇరవై లక్షలమంది శ్రోతలు ఉన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ల సాయంతో షోకి కావలసిన కంటెంట్ తయారుచేస్తాం. ‘సునో ఇండియా’ ద్వారా దేశానికి వినిపించిన మొదటి కథ ‘చైల్డ్ అడాప్షన్’. పిల్లలను దత్తత తీసుకోవడం, దాని వెనుక కారణాలు, సంఘర్షణలు, ఉద్వేగాలు.. ఇలా అన్ని కోణాలనూ విశ్లేషించాం. ఈ కాన్సెప్ట్ మా అనుభవంలోంచి తీసుకున్నదే. ఏ విషయం గురించి చర్చించినా మేం ఫలానాదే ఒప్పు అని నిర్ధారించం. అన్ని వైపులనుంచీ చూపిస్తాం. మా కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ మేనకారావు ఆధ్వర్యంలో ‘క్షయ వ్యాధి’పై ఒక షో చేశాం. మంచి స్పందన వచ్చింది. అరుదైన రుగ్మతలతో బాధపడేవారి జీవితాలు, కుటుంబ సమస్యలను వివరిస్తూ ‘రేర్ లైవ్స్(Rare Lives)’ అనే కార్యక్రమమూ నిర్వహించాం. ఆ కథలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నవారూ ఉన్నారు.
ఇప్పటివరకూ హిందీ, ఇంగ్లిష్, తెలుగుతోపాటు తమిళంలో ఒక షో చేశాం. తీసుకున్న అంశాన్నిబట్టి, ప్రజల ఆదరణను బట్టి కొన్నిటిని ఎపిసోడ్స్గా, కొన్నిటిని సీజన్స్గా చేస్తున్నాం. జాతీయ ఎన్నికలప్పుడు చేసిన ‘ఎవ్రీ ఓట్ మ్యాటర్స్(Every Vote Matters)’ షోకు మంచి ఆదరణ లభించింది. ఎన్నికల గురించే కాకుండా అసలు ఓటు వేయడం
వెనకున్న అవసరం, బాధ్యతను సమగ్రంగా చర్చించాం. ఆ షో కూడా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో తమిళనాడు ఎన్నికల వేళ మరో పాడ్కాస్ట్ చేశాం. హిందీ- ఉర్దూ కలయికతో ‘ఎలక్షన్ నామా’, స్త్రీలకోసం పాటుపడుతున్న షాహీన్ సంస్థతో కలిసి ‘పింజ్రా తోడ్ కే’, చార్మినార్ విశిష్టత వివరిస్తూ ‘బియాండ్ చార్మినార్’ చేశాం. ఆర్థిక వ్యవస్థ, వాతావరణం, సైన్స్, పిల్లలు, మహిళలు, కళలు, సాంకేతికత, వ్యాధులు.. ఇలా ప్రతి అంశాన్నీ ఓ ఆసక్తికరమైన షోగా మలుస్తున్నాం.
తెలుగులో ‘సమాచారం-సమీక్ష’, ‘కథ చెప్పవా అమ్మమ్మా’ షోలకు మంచి ఆదరణ వస్తున్నది. ప్రచారానికి మేం ఎప్పుడూ పెద్దగా ఖర్చుచేయలేదు. పాడ్కాస్ట్లో నిజాయతీ, మా స్వరంలో నిబద్ధత ఉంటే మౌత్ పబ్లిసిటీకి మించినది లేదని బలంగా నమ్మాం. అనుకున్నట్టుగానే జరిగింది. సోషల్ మీడియా ద్వారా ‘సునో ఇండియా’ గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది. కొవిడ్ లాక్డౌన్ సమయంలో సురభి కళాకారుల సమస్యలపై మేం చేసిన షోను ట్యాగ్ చేస్తూ కొందరు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత గారికి ట్వీట్ చేశారు. వెంటనే కవితగారి ఆఫీసు నుంచి సురభి కళాకారులకు సాయం అందింది. ఈ సంవత్సరం మరిన్ని షోలు ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలుగులో ఓ ఫేమస్ హోస్ట్తో చేయబోతున్నాం.
స్థాపించిన మూడేండ్లలోనే ‘సునో ఇండియా’ మంచి గుర్తింపును సాధించింది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నుంచి రైజింగ్ మీడియా అవార్డ్ అందుకున్నాం. గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్లో డిజిటల్ మీడియా విభాగం నుంచి టాప్ టెన్లో నిలిచాం. ఈ మధ్యనే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. చదువుకునే రోజుల్లో నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ, ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడంతో జర్నలిజం వైపు వచ్చాను. మా తాతగారు డి.సీతారాం జర్నలిస్ట్గా పనిచేశారు. పెదనాన్న, అమ్మ కూడా పాత్రికేయులే. నాన్న జర్నలిజం బోధిస్తారు. దీంతో నాలోనూ జర్నలిజంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అస్సాం, కశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల జర్నలిస్ట్లతో కలిసి పనిచేస్తున్నాం. పాడ్కాస్ట్లో ఒక ఫెలోషిప్ ఏర్పాటుచేసి విలువలతో పనిచేసే పాత్రికేయులను ప్రోత్సహించాలని ఉంది. పాడ్కాస్ట్ నిర్వహణలో శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు చేస్తున్నాం. దేశం నలుమూలల నుంచీ స్థానిక జర్నలిస్టులను భాగ స్వాములను చేస్తూ, ఏ అంశాన్నీ వదలకుండా వీలైనన్ని షోలు నిర్వహించాలన్నది లక్ష్యం.
…? ప్రవళిక వేముల