ఇప్పటివరకు వెండితెరపై హాస్యాన్ని, హీరోయిజాన్ని పండించిన సునీల్ ‘పుష్ప’ సినిమాలో సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. మంగళం శ్రీను పాత్రలో ప్రతినాయకుడిగా తనలోని భిన్న కోణాన్ని చూపించబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆదివారం సునీల్ ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. మంగళం శ్రీను పాత్రలో ఆయన నటించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టర్లో ఖద్దరు దుస్తులు, మెడలో గొలుసులు ధరించి ఎరుపెక్కిన కళ్లతో సీరియస్ లుక్లో సునీల్ కనిపిస్తున్నారు. దుష్టత్వానికి రూపంగా పవర్ఫుల్గా సునీల్ పాత్ర ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది.
నటుడిగా ఆయన్ని నవ్యరీతిలో ఆవిష్కరిస్తుందని అంటున్నారు. చిత్తూరు బ్యాక్డ్రాప్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తొలి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకురానున్నది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, రావురమేష్, అనసూయభరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, మోనిక, సాహిత్యం: చంద్రబోస్.