ముంబై: క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం 33 ఏండ్ల కిందట ఇచ్చిన స్థలాన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) బుధవారం వెల్లడించింది. అకాడమీ ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సన్నీకి బాంద్రా శివారులో స్థలాన్ని కేటాయించింది. ఏండ్లు గడిచినా అకాడమీ ఏర్పాటులో ముందడుగు పడలేదు. అకాడమీ ఏర్పాటుపై గతంలో సచిన్ టెండూల్కర్, గవాస్కర్ కలిసి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సంప్రదింపులు చేసినా కార్యరూపం దాల్చలేదు. అనంతరం నిరుపయోగంగా భూమి ఉండడంపై నిరుడు గవాస్కర్ను మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్హద్ గుర్తు చేశారు. 8 నెలలుగా ఈ భూమి విషయమై ఎంహెచ్ఏడీఏ సంప్రదింపులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో అకాడమీని ఏర్పాటు చేయలేనని పేర్కొంటూ ముఖ్యమంత్రి ఠాక్రేకు సునీల్ గవాస్కర్ లేఖ రాశాడని మంత్రి జితేంద్ర తెలిపారు. దీంతో ఆ స్థలం తిరిగి ఎంహెచ్ఏడీఏకు దక్కింది.