సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతున్నది. అక్కడ యుద్ధం జరుగుతుండటంతో దిగుమతులపై ప్రభావం పడింది. సముద్ర, వాయుమార్గాలు మూతపడటంతో అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో నూనెల ధరల భగ్గుమంటున్నాయి. యుద్ధం కొనసాగితే లీటర్ ధర రూ.200 దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని నూనెల కంపెనీల ప్రతినిధులు, ఆయిల్ఫెడ్ అధికారులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వంటింటి బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నది. యుద్ధజ్వాలల్లో వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. నెల వ్యవధిలోనే అన్ని రకాల వంటనూనెల ధరలు లీటర్కు రూ.20కి పైగా పెరిగాయి. జనవరిలో సన్ఫ్లవర్ నూనె లీటర్ ధర రిటైల్ మార్కెట్లో రూ.134 ఉండగా ఇప్పుడు రూ.157కు పెరిగింది. లీటర్ రూ.23 పెరగడం గమనార్హం. వేరుశనగ నూనె ధర రూ.136 నుంచి 159కి ఎగబాకింది. పామాయిల్ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు దూసుకెళ్లింది. అన్ని నూనెల కన్నా పామాయిల్ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ, దేశీయ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి జరగడం లేదు. ఏటా రూ.70 వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ప్రతినెలా దాదాపు 10 లక్షల టన్నుల నూనెలను దిగుమతి చేసుకోక తప్పడం లేదు.
ఒకవేళ యుద్ధం ముగిసినా మరో నెల పాటు ధరల పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు. వరుసగా నూనెల ధరలు పెరుగుతుండటంతో పలువురు వ్యాపారులు స్టాక్ను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న దుకాణాదారులు, వినియోగదారులు అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ దుకాణాల ముందుకు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ క్రాస్రోడ్లోని విజయ ఆయిల్స్టాల్లో ఒక్కరోజే రూ.8.50 లక్షల విలువైన నూనెను విక్రయించడం గమనార్హం. ఈ స్టాల్ను ప్రారంభించిన తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే ప్రథమం.